Usain Bolt: ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగెత్తగల వీరుడు ఉసేన్ బోల్ట్. తన అద్భుతమైన ప్రదర్శనలతో ఇప్పటి వరకు ఎనిమిది ఒలంపిక్ మెడల్స్ సాధించాడు. 2017లో రిటైర్మెంట్ ప్రకటించిన ఉసేన్కు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ఉసేన్కు భారీ షాక్ తగిలింది. ఆయన ఆర్థిక మోసం బారినపడ్డాడు. ఏకంగా అతని ఖాతా నుంచి 12.7 మిలియన్ డాలర్లు మాయమయ్యాయి.
ఉసేన్ జమైకాకు చెందిన చెందిన స్టాక్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ అనే పెట్టుబడుల సంస్ధలో రిటైర్మెంట్, లైఫ్టైమ్ సేవింగ్స్లో భాగంగా ఓ అకౌంట్ ఓపెన్ చేశాడు. అయితే ఆ ఖాతాలో 12.8 మిలియన్ డార్లు ఉండగా.. ఇటీవల 12.7 మిలిమన్ డాలర్లు (దాదాపు రూ.103 కోట్లు) మాయమయ్యాయి. ప్రస్తుతం అతడి ఖాతాలో కేవలం 12 వేల డాలర్లు మాత్రమే ఉన్నాయి. ఎస్ఎస్ఎల్ సంస్ధకు చెందిన ఓ ఉద్యోగి నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడి ఆ డబ్బును దోచుకున్నట్లు సమాచారం. 10 రోజుల్లోగా ఆ డబ్బును తిరిగి ఖాతాలో జమచేయాలని, లేనిపక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఉసేన్ తరుపున న్యాయవాదులు సంస్థను హెచ్చరించారు.
ఈ మోసాన్ని జనవరి ఆరంభంలోనే గుర్తించామని ఎస్ఎస్ఎల్ సంస్ధ వెల్లడించింది. ఉసేన్తో పాటు దాదాపు 30 మంది ఖాతాదారులు తమ డబ్బును కోల్పోయినట్లు తెలిపింది. తమ సంస్థకు చెందిన ఓ ఉద్యోగి మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడడంతోనే డబ్బు మాయమైందని ప్రకటించింది. ఈ ఘటనపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశామని చెప్పింది. తమ ఖాతాదారుల ఆస్తులను మరింత భద్రంగా చూసుకునేందుకు, మెరుగైన సేవలు అందించేందుకు మరింత కృషి చేస్తామని వెల్లడించింది.