Jagitial : తెలంగాణలో పట్టణాల అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ లు వివాదాలుగా మారుతున్నాయి. వీటిని రైతులు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే కామారెడ్డిలో ఒకవైపు ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు జగిత్యాల ప్రజలు ఆందోళన బాటపట్టారు. జగిత్యాల జిల్లా కేంద్రానికి వచ్చే ప్రధాన రహదారులను నాలుగు వైపులా నిర్బంధించారు.
జగిత్యాల పట్టణ కొత్త మాస్టర్ ప్లాన్ను రద్దు చేయాలని కోరుతూ 15 రోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. జగిత్యాల- నిజామాబాద్, జగిత్యాల- ధర్మపురి, జగిత్యాల -గొల్లపల్లి, జగిత్యాల -కరీంనగర్ రహదారులను ఆయా గ్రామ ప్రజలు నిర్బంధించారు. మాస్టర్ ప్లాన్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అలాగే జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆందోళన నేపథ్యంలో జగిత్యాలలో కంటి వెలుగు కార్యక్రమాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ రద్దు చేసుకున్నారు.
రైతులు, స్థానికులు చేస్తున్న నిరసనలకు కాంగ్రెస్, బీజేపీ నేతలు మద్దతు తెలిపారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని నిరసిస్తూ పలు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. తమ గ్రామాన్ని మాస్టర్ ప్లాన్ నుంచి తొలగించాలని గ్రామ పంచాయితీ పాలకవర్గాలు ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. తీర్మాన ప్రతులను జగిత్యాల మున్సిపల్ కమిషనర్కు అందజేశారు. తిమ్మాపూర్ గ్రామ సభకు హాజరైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రైతులకు మద్దతు తెలిపారు. మాస్టర్ ప్లాన్పై నిరసనలు ఉద్ధృతం చేసేందుకు రైతు జేఏసీ ఏర్పాటుకు రైతులు సన్నద్ధమయ్యారు.
జగిత్యాల బల్దియా జారీ చేసిన ముసాయిదా మాస్టర్ప్లాన్పై బుధవారం కూడా ఆందోళనలు కొనసాగాయి. జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేట గ్రామ రైతులు పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. మోతె, ధరూర్, తిప్పన్నపేట, నర్సింగాపూర్, హస్నాబాద్, అంబారిపేట, తిమ్మాపూర్ గ్రామాలను మాస్టర్ప్లాన్ నుంచి తొలగించాలని కోరుతూ మోతె సర్పంచ్ భర్త సురకంటి రాజేశ్వర్రెడ్డి ట్విట్టర్ ద్వారా పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ను కోరారు. అటు కామారెడ్డి, ఇటు జగిత్యాలలో ఆందోళనలను ప్రభుత్వం ఎలా చల్లార్చుతుందో చూడాలి.