TDP Office : ఏపీలో ప్రతిపక్ష నేతల ఇళ్లు, పార్టీ కార్యాలయాల తొలగింపు చర్యలు ఆగడంలేదు. ఇటీవల ఇప్పటంలో జనసేన కార్యకర్తల ఇళ్లు తొలగించడంపై పెనుదుమారం రేగింది. తాజాగా టీడీపీ కార్యాలయాన్ని తొలగించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో తెల్లవారుజాము నుంచే పోలీసులు, అధికారులు మోహరించి స్థానికంగా ఉన్న టీడీపీ కార్యాలయాన్ని తొలగించారు. టీడీపీ ఫ్లెక్సీలు, ఫర్నిచర్, కంప్యూటర్లను తరలించారు. పార్టీ కార్యాలయానికి బొమ్మసాని సుబ్బయ్య చౌదరి కాంప్లెక్స్ అని బోర్డు ఏర్పాటు చేశారు. ఆఫీస్ బయట కూర్చోవడానికి ఏర్పాటు చేసిన పసుపు రంగు బల్లలను అధికారులు తొలగించారు. పార్టీ కార్యాలయం వైపు ఎవరూ రాకుండా ముందస్తుగా చర్యలు చేపట్టారు. ఆ మార్గంలో బారీకేడ్లు పెట్టి ఎవరూ రాకుండా అడ్డుకున్నారు.
టీడీపీ కార్యాలయాన్ని తొలగించడంతో ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు అక్కడికి చేరుకుని నిరసన తెలిపారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు గృహనిర్బంధం చేశారు. పోలీసులు ఆయన నివాసానికి చేరుకుని బయటకు రాకుండా అడ్డుకున్నారు.
వివాద నేపథ్యం ఇదీ..
గొల్లపూడిలో టీడీపీ కార్యాలయ స్థలం లీజుపై కొంతకాలంగా వివాదం నడుస్తోంది. లీజుదారుడు ఆలూరి చిన్నా, ఆయన కుటుంబసభ్యుల మధ్య వివాదం తలెత్తడంతో హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్థల వివాదం పరిష్కరించుకోవాలని ఆలూరి చిన్నా కుటుంబ సభ్యులకు గత నెల 28న తహసీల్దార్ నోటీసులు ఇచ్చారు. ఈ సమస్యను పరిష్కరించుకునేలోపే పార్టీ కార్యాలయాన్ని అక్కడి నుంచి అధికారులు, పోలీసులు తొలగించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ ఆఫీస్ స్థలం లీజుదారుడు కుటుంబలో తలెత్తిన వివాదాన్ని ఆసరాగా చేసుకుని ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందని మండిపడుతున్నారు.