BRS: ఖమ్మంలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ. వారం పది రోజులుగా ఒకటే హడావుడి. అన్నట్టుగానే లక్షల్లో జన సమీకరణ అయితే చేశారు. చెప్పినట్టుగానే ముగ్గురు సీఎంలను, ఓ మాజీ సీఎంను రప్పించారు. సభ అయితే గ్రాండ్ సక్సెస్. కానీ, కేసీఆర్ స్పీచే చప్పగా సాగిందనే టాక్.
ఖమ్మం వేదికగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎజెండాను ప్రకటిస్తారని, పార్టీ పాలసీ ఏంటో చెబుతారని అంతా భావించారు. కానీ, అలాంటిదేమీ లేకుండానే చాలా సాదాసీదాగా సాగింది కేసీఆర్ ప్రసంగం అంటున్నారు. ఇంతకుముందు చెప్పిన డైలాగులే మళ్లీ రిపీట్ చేశారని చెబుతున్నారు. చైనాతో పోల్చడం.. నదులు, నీళ్ల లెక్కలు చెప్పడం.. రైతులకు ఉచిత కరెంట్, రైతు బంధు ఇస్తామనడం.. దేశవ్యాప్తంగా దళిత బంధు అమలు.. ఇలా గతంలో చెప్పిన మాటలే మళ్లీ చెప్పారు. ఎల్ఐసీ, విశాఖ ఉక్కులను మళ్లీ కొంటామని.. మోదీది ప్రైవేటైజేషన్ అయితే.. మాది నేషనలైజేషన్ అంటూ పాత డైలాగే మళ్లీ రిపీట్ చేశారు. చివరాఖరికి.. అంతిమ విజయం మనదే మనదే మనదే.. అంటూ మూడుసార్లు నినదించి ముక్తాయించారు సీఎం కేసీఆర్.
గులాబీ బాస్ నుంచి ఇంకా ఎక్కువే ఆశించిన వారిని.. ఖమ్మం సభలో కేసీఆర్ ప్రసంగం నిరుత్సాహ పరిచిందనే అంటున్నారు. పాత క్యాసెటే మళ్లీ వినడం బోర్ తెప్పించిందని పెదవి విరుస్తున్నారు. అయితే, సభలో ఖమ్మం జిల్లాపై వరాల జల్లు కురిపించడం మాత్రం కొత్త విషయమే.
ఖమ్మం సభలో జిల్లా వాసులకు సీఎం కేసీఆర్ పలు వరాలు ప్రకటించారు. జిల్లాలోని మొత్తం 589 గ్రామ పంచాయతీలకు రూ.10లక్షలు.. జిల్లాలోని మున్సిపాలిటీలకు రూ.30 కోట్లు.. ఖమ్మం మున్సిపాలిటికీ రూ.50 కోట్లు మంజూరు చేశారు ముఖ్యమంత్రి. 10వేల జనాభా దాటిన మేజర్ పంచాయతీలకు రూ.10 కోట్ల నిధులు కేటాయించారు. మున్నేరు నదిపై వంతెన, ఖమ్మం జిల్లాకు ఇంజినీరింగ్ కాలేజ్ మంజూరు చేశారు. జర్నలిస్టులు తమ ఇళ్ల స్థలాల సంగతి ఏంటని ప్రశ్నించడంతో.. అక్కడికక్కడే ఖమ్మం జిల్లా కేంద్రంలో నెలలోగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆర్థిక మంత్రి హరీష్ రావును ఆదేశించారు కేసీఆర్.