Bandi Sanjay: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు భగీరథ్ వివాదం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ బహదూర్పల్లిలోని మహేంద్ర యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతోన్న భగీరథ్ తోటి విద్యార్థిపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. అసభ్య పదజాలంతో దూషిస్తూ, చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ వ్యవహారంపై దుండిగల్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైంది.
అయితే భగీరథ్ చేతిలో దాడికి గురైన విద్యార్థి ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ.. ‘‘భగీరథ్ స్నేహితుడి చెల్లెలిని ఇబ్బంది పెట్టాను. అందుకే భగీరథ్ నాపై చేయి చేసుకున్నాడు. ఆతర్వాత మీమంతా కలిసిపోయాము’’ అంటూ వెల్లడించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఈ వ్యవహారంపై స్పందించిన బండి సంజయ్.. దమ్ముంటే తనతో రాజకీయం చేయాలని, పిల్లల జీవితాలతో ఆడుకోవడం సరికాదని వెల్లడించాడు. సీఎం కేసీఆర్కు తనతో రాజకీయం చేసే దమ్ములేక తన కొడుకును లాగుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ మనువడి విషయంలో కొందరు తప్పుడు వ్యాఖ్యలు చేస్తే తాను ఖండించినట్లు గుర్తు చేశారు. తప్పు చేశానని దెబ్బలు తిన్న విద్యార్థే ఒప్పుకున్నాక కేసు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతావా? అంటూ ధ్వజమెత్తారు. బాధిత యువతి, తన కొడుకు జీవితాన్ని నాశనం చేయాలని కుట్ర చేస్తున్నారని విమర్శించారు.