New slabs in IT? Is it a relief for the middle class? : ప్రతీ ఏడాదీ బడ్జెట్కు ముందు… ఈసారి వేతన జీవులకు ఊరట, మధ్యతరగతికి ఉపశమనం అంటూ ఎన్నో వార్తలు రావడం, తీరా బడ్జెట్ ప్రవేశపెట్టాక అంతా ఉసూరుమనడం ఎన్నో ఏళ్లుగా చూస్తూనే ఉన్నాం. ప్రతీ ఏడాది లాగానే ఈసారి కూడా… వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులకు సంబంధించి బడ్జెట్లో కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కొత్త పన్ను విధానంలో కీలక మార్పులు ఉంటాయని… పన్ను రేట్లు తగ్గించి కొత్త పన్ను స్లాబ్లను అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోందని అంటున్నారు. ఇక ప్రధాని కార్యాలయం తుది నిర్ణయమే తరువాయి అని చెబుతున్నారు.
పాత పన్ను విధానానికి అదనంగా 2021లో కొత్త పన్ను వ్యవస్థను తీసుకొచ్చింది… కేంద్ర ప్రభుత్వం. పాత పన్ను విధానంలో కేవలం మూడు స్లాబ్లే ఉండేవి. కొత్త పన్ను విధానంలో ఆరు స్లాబ్లు తీసుకొచ్చారు. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఆదాయంపై 5 శాతం… రూ.5 లక్షల నుంచి రూ.7.5 లక్షల వరకు 10 శాతం… రూ.7.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు 15 శాతం… రూ.10 లక్షల నుంచి రూ.12.5 లక్షల వరకు 20 శాతం… రూ.12.5 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు 25 శాతం… రూ.15 లక్షలు ఆపై ఆదాయం కలిగిన వారికి 30 శాతం పన్ను వర్తించేలా ఆరు స్లాబ్లు ప్రవేశపెట్టారు. ఏ పన్ను విధానాన్ని ఎంచుకోవాలనే దానిపై… పన్ను చెల్లింపుదారులకు స్వేచ్ఛ ఇచ్చారు. ఇందులో పన్ను మినహాయింపులను చూపించేందుకు అవకాశం లేదు.
ఈసారి బడ్జెట్లో మధ్యతరగతికి పెద్దపీట వేయాలని భావిస్తున్న కేంద్రం… ఆదాయ పన్ను విషయంలో ఊరటనిచ్చే అంశాన్ని పరిశీలిస్తోందని ప్రచారం జరుగుతోంది. కొత్త పన్ను విధానంలో మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం రూ.15 లక్షలు, ఆపై ఉన్న ఆదాయం మొత్తానికి 30 శాతం పన్ను వర్తిస్తుండగా… ఆదాయ మొత్తాన్ని పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎప్పట్లాగే ఇదంతా కేవలం ప్రచారామేనా? లేక నిజంగానే వేతన జీవులు, మధ్యతరగతికి ఊరట దక్కుంతుందా? అనేది బడ్జెట్ వచ్చాక చూడాలి.
Follow this link for more updates :- Bigtv