BRS: నలుగురు ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కనిపించి కనువిందు చేశారు. ఖమ్మం సభతో బీఆర్ఎస్ సత్తా చాటింది. కేంద్రానికి స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది. ఢిల్లీ సీఎం, పంజాబ్ సీఎం, కేరళ సీఎం, యూపీ మాజీ సీఎం.. అంతా హేమాహేమీలే. తెలంగాణ సీఎంతో సై అన్నారు. ఆ ఫ్రేమ్ చూట్టానికి చాలా బాగుంది. ఆ గ్రూప్ ఫోటో.. పొలిటికల్ గా ట్రెండింగ్ అవుతోంది. అంతా బాగుంది కానీ, తెలుగువారికి ఓ లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ గ్రూప్ ఫోటోలో… ఏపీ సీఎం జగన్ ఎందుకు లేడనే చర్చ నడుస్తోంది.
గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం విషయంలోనూ కేసీఆర్ ఇలాంటి స్ట్రాటజీనే ప్లే చేశారు. ఏపీ సీఎం జగన్, అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీష్ లను రప్పించారు. ముగ్గురూ కలిసి ముచ్చటగా ప్రాజెక్టులు, పంప్ హౌజ్ లు ప్రారంభించారు. ఆ సమయంలో కేసీఆర్-జగన్ జోడి చూడముచ్చటగా అనిపించింది. వాళ్లిద్దరూ ఇప్పటికీ రహస్య స్నేహితులే అనే ప్రచారమూ ఉంది.
ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఖమ్మం బీఆర్ఎస్ బహిరంగ సభకు జగన్ ను కూడా ఆహ్వానిస్తారని అనుకున్నారు. కానీ, కేసీఆర్ పిలవలేదు. పిలవందే జగన్ రాలేడు. ఎందుకు? సీఎం జగన్ కు ఎందుకు ఇన్విటేషన్ పంపలేదు? అనేది ప్రశ్న.
ఏపీలోనూ బీఆర్ఎస్ పోటీ చేయాలని భావిస్తోంది. గెలవకున్నా.. ఓ సెక్షన్ ఓట్లు చీల్చి.. పరోక్షంగా జగన్ కే లబ్ది చేస్తారనే ఆరోపణ ఉంది. ఇదంతా వాళ్లిద్దరూ కలిసి ఆడుతున్న పొలిటికల్ గేమ్ అనే విమర్శ ఉంది. ఇప్పుడు ఖమ్మం సభకు జగన్ ను కూడా పిలిచి.. ఆయన కూడా వచ్చుంటే.. ఇక ఏపీలో బీఆర్ఎస్ పావులు ముందుకు కదలవు. అసలు వ్యూహానికే ఎసరు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే, జగన్ కు నో ఇన్విటేషన్ అంటున్నారు.
మరోవైపు, ఏపీ సీఎం జగన్ కు కేంద్ర బీజేపీ మద్దతు బాగా అవసరం. సీబీఐ కేసుల్లో బెయిల్ పై బయట ఉండి మరీ ఏపీని పాలిస్తున్నారు. కేంద్రంతో ఢీకొట్టే సాహసం జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరు. కేసీఆర్ అంటే ఇష్టమే అయినా.. బీజేపీ అంటే భయం కూడా ఉందంటున్నారు. అందుకే, ఎందుకొచ్చిన గొడవ అనుకుని.. బీఆర్ఎస్ సభలో జగన్ ప్రస్తావన లేకుండా వారిద్దరూ జాగ్రత్త పడ్డారని చెబుతున్నారు. ఇకముందు కూడా బీఆర్ఎస్ ప్రస్తానంలో జగన్ పాత్ర ఉండకపోవచ్చు అంటున్నారు.