BRS : ఖమ్మం బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు సర్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ, పంజాబ్, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా, పలువురు జాతీయ నేతలు మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ బుధవారం ఉదయం అల్పాహార విందు ఇచ్చారు. ఈ సమయంలో జాతీయ రాజకీయాలు, జాతీయ అంశాలపై చర్చించారు.
విందు అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి రెండు హెలికాప్టర్లలో కేసీఆర్ తోపాటు నేతలందరూ యాదాద్రి బయలుదేరి వెళ్లారు. కేసీఆర్, కేజ్రీవాల్ , భగవంతమాన్, అఖిలేష్ యాదవ్ స్వామిదర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు, అధికారులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు వారికి వేద ఆశీర్వచనాలు అందించారు. అనంతరం స్వామివారి చిత్రపటాన్నీ ఆలయ అధికారులు అందజేశారు. ఆ తర్వాత ఆలయంలోకి ముఖ్యమంత్రులు కలియ తిరుగుతూ ఆలయ విశిష్టతలు తెలుసుకున్నారు.ఈ సమయంలో కేరళ సీఎం విజయన్ , సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా స్వామి దర్శనానికి రాలేదు. గెస్ట్ హౌస్ లోనే ఉండిపోయారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి దర్శనం అక్కడి నుంచి ఖమ్మం వెళ్లారు.
అటు భారత్ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ సభకు సర్వం సిద్ధమైంది. 5 లక్షల మంది వస్తారన్న అంచనాతో ఖమ్మంలో సభా ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. 2001 మే 17న కరీంనగర్లో టీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో నిర్వహించిన సింహగర్జన సభ స్ఫూర్తితో ఖమ్మం సభకు ఏర్పాట్లు చేశారు. ఈ సభను ఖమ్మంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకోగానే మంత్రి హరీశ్రావు రంగంలోకి దిగారు. ఖమ్మంలోనే మకాం వేసి, సభాస్థలి ఎంపిక నుంచి ప్రాంగణాన్ని పూర్తిస్థాయిలో తీర్చిదిద్దే వరకు స్వయంగా పర్యవేక్షించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా, సూర్యాపేట, హుజూర్నగర్, కోదాడ, తుంగతుర్తి, డోర్నకల్, మహబూబాబాద్, పాలకుర్తి నియోజకవర్గాలతోపాటు ఏపీ, ఛత్తీస్గఢ్ల నుంచి సైతం జనసమీకరణకు ఆయా ప్రాంతాల నాయకులు కృషి చేశారు.
ఖమ్మం-వైరా ప్రధాన రహదారిపై వెంకటాయపాలెం సమీపంలో 70 ఎకరాల్లో సభకు ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికను జపాన్ సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దారు. వేదికపై సీఎం కేసీఆర్తో పాటు విజయన్, కేజ్రీవాల్, భగవంత్మాన్, అఖిలేశ్ యాదవ్, డి.రాజా చిత్రపటాలతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రధాన పార్టీల నేతలకు వేదికకు ఎదురుగా కుర్చీలు ఏర్పాటు చేశారు. మహిళలు, పురుషులకు వేర్వేరుగా సుమారు 75 వేలకు పైగా కుర్చీలను సిద్ధం చేశారు. ప్రధాన నేతల ప్రసంగాలను వీక్షించేందుకు ప్రాంగణంలో 50 ఎల్ఈడీ తెరలను అమర్చారు. ప్రధాన వేదికకు ఎడమవైపున 20 అడుగుల దూరంలో ధూంధాం కళాకారుల కోసం మరో వేదికను ఏర్పాటు చేశారు.
ఖమ్మం సభ ద్వారా బీజేపీయేతర విపక్షాల ఐక్యత సంకేతాలివ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. సభలో ఇతర రాష్ట్రాల సీఎంల ప్రసంగాల అనంతరం కేసీఆర్ తన సందేశం ఇవ్వనున్నారు. పార్టీ ఏర్పాటు నేపథ్యం, 75 ఏళ్ల భారతావని దుస్థితి, వనరుల నిరుపయోగం తదితర అంశాలపై ప్రసంగించనున్నారని తెలుస్తోంది. జాతీయ పార్టీ విధివిధానాలను ప్రకటించనున్నారు. ఇప్పటికే ‘అబ్కీ బార్ కిసాన్ సర్కార్’ అనే నినాదాన్ని ప్రకటించారు. ఈ ఏడాది 9 రాష్ట్రాల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ రాజకీయ కార్యాచరణను ప్రకటించనున్నారు. కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో పోటీపై మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
సభా ప్రాంగణమంతటా కేసీఆర్తోపాటు జాతీయ నాయకుల కటౌట్లు నెలకొల్పారు. ఖమ్మం నగరం చుట్టూ 5 కి.మీ. విస్తీర్ణంలో గులాబీ తోరణాలు, భారీ కటౌట్లు, హోర్డింగులు, ఫ్లెక్సీలతో ముస్తాబు చేశారు. పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనపు డీజీ విజయ్కుమార్, ఐజీపీ షాన్వాజ్ ఖాసిం, చంద్రశేఖర్రెడ్డి, డీఐజీలు రమేశ్నాయుడు, ఎల్ఎస్ చౌహాన్, వరంగల్, ఖమ్మం సీపీలు రంగనాథ్, విష్ణు వారియర్ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సభ నిర్వహణకు 5వేలకుపైగా పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నారు.