SHAR : శ్రీవారి కోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం ..షార్ ఎన్నో ప్రయోగాలకు వేదికగా నిలిచింది. అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తోంది. ఇలాంటి చోట వరుస ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల 24 గంటల వ్యవధిలో కానిస్టేబుల్, ఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాజాగా సీఐఎస్ఎఫ్ సీఐ వికాస్సింగ్ మంగళవారం తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఒకరోజు వ్యవధిలోనే ఆయన భార్య ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది.
2015 బ్యాచ్కు చెందిన వికాస్ సింగ్ శిక్షణానంతరం ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో విధులు నిర్వహించారు. గతేడాది నవంబర్ లో ఆయనను శ్రీహరికోటకు బదలీ చేశారు. ముంబైలో విధులు నిర్వహిస్తున్న సమయంలో వికాస్ సింగ్ క్రమశిక్షణ చర్యలకు గురైనట్ల సమాచారం.
వికాస్ సింగ్ ఆత్మహత్య సమాచారాన్ని ఉత్తర్ప్రదేశ్లో ఉన్న వికాస్ సింగ్ కుటుంబసభ్యులకు అధికారులు తెలియజేశారు. మంగళవారం ఆయన భార్య ప్రియా సింగ్ తన అన్న, పిల్లలతో కలిసి శ్రీహరికోటకు చేరుకున్నారు. భర్త మృతదేహం వద్ద కన్నీటిపర్యంతమయ్యారు. ఆ తర్వాత శ్రీహరికోటలోని నర్మద అతిథి భవన్లో బస చేశారు. వికాస్ సింగ్ మృతిపై స్థానిక పోలీసులు ప్రియాసింగ్ను విచారించారు.
బుధవారం తెల్లవారుజామున ప్రియాసింగ్ గదిలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబసభ్యులు వెంటనే సీఐఎస్ఎఫ్ సిబ్బందికి సమాచారం అందించారు. భార్య, భర్తల మృతదేహాలను శ్రీహరికోట నుంచి పోస్టుమార్టం కోసం సూళ్లూరుపేట సర్వజన ఆసుపత్రికి తరలించారు. భర్త మరణాన్ని తట్టుకోలేకే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
సబ్ ఇన్స్పెక్టర్ వికాస్ సింగ్, ప్రియాసింగ్ దంపతులకు కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు ఒకటో తరగతి, కుమార్తె ఎల్కేజీ చదువుతున్నారు. మరో కుమార్తె చిన్నపాప. భార్య, భర్తలు ఒకోరోజు వ్యవధిలో ఆత్మహత్య చేసుకోవడంతో పిల్లలు అనాథలుగా మారారు. మరోవైపు వారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ఘటనలు వరుసగా షార్ కేంద్రంలో జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.