BRS: నలుగురు సీఎంలు. ఐదు లక్షల మంది ప్రజలు. ఖమ్మంలో అట్టహాసంగా భారీ బహిరంగ సభ. ఇక్కడి నుంచే యావత్ దేశానికి బీఆర్ఎస్ బిగ్ మెసేజ్ ఇవ్వనుంది. కేంద్రంలోని మోదీకి ఎన్నికల సవాల్ విసరనుంది. అందుకే, అత్యంత ప్రతిష్టాత్మకంగా ఖమ్మం సభకు ఏర్పాట్లు చేస్తోంది బీఆర్ఎస్.
కేటీఆర్ ను కాదనో, కేటీఆర్ వల్ల కాదనో.. ఖమ్మం సభ బాధ్యతలు మాస్ లీడర్ మంత్రి హరీష్ రావుకు అప్పగించారు గులాబీ బాస్. వెంటనే రంగంలోకి దిగన అల్లుడు.. ఖమ్మంలో కీలక నేతైన తుమ్మలను మచ్చిక చేసుకున్నారు. బీఆర్ఎస్ లో ప్రాధాన్యత లేదంటూ.. పార్టీ మారే ఆలోచనలో ఉన్న తుమ్మలకు ఏం నచ్చజెప్పారో.. ఏం ఆశ చూపించారో తెలీదు కానీ.. ఆయన కారులోనే సెటిల్ అయిపోయారు. మాజీ ఎంపీ పొంగులేటి మాత్రం రెబెల్ జెండానే పట్టుకున్నారు. రేపోమాపో బీజేపీలో చేరుతున్నారు.
ఖమ్మంలో బీఆర్ఎస్ బలం అంతంత మాత్రమే. అక్కడ కాంగ్రెస్, టీడీపీ, కమ్యూనిస్టుల ఓటు బ్యాంకు ఎక్కువ. గత ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఒక్కటంటే ఒక్క స్థానంలోనే గెలిచింది బీఆర్ఎస్. అందుకే ఆ ఒకే ఒక్కడు పువ్వాడ అజయ్ కి మంత్రి పదవి కట్టబెట్టి.. పార్టీ ప్రాబల్యం పెంచేలా చూశారు. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలను, నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని.. బీఆర్ఎస్ బలంగా ఉందని చూపించే ప్రయత్నం చేశారు. అయితే, ఈ వలసలతో ఎంత లాభం జరిగిందో.. తుమ్మల, పొంగులేటి వల్ల అంతే నష్టం కలిగింది. తుమ్మల గండం నుంచి ప్రస్తుతానికి గట్టెక్కినా.. పొంగులేటి పొగ మాత్రం అలానే ఉంది. కంగారు పెడుతున్న ఖమ్మం రాజకీయ సమీకరణాలను ఏకపక్షం చేసేందుకే ఏరికోరి మరీ అక్కడే బహిరంగ సభ పెడుతున్నారు కేసీఆర్.
ఖమ్మం బహిరంగ సభకు ఢిల్లీ, కేరళ ముఖ్యమంత్రులను రప్పించి.. లక్షల్లో జనాన్ని సమీకరించి.. ఇక భవిష్యత్ అంతా బీఆర్ఎస్ దే అనే మెసేజ్ బలంగా ఇవ్వాలని భావిస్తున్నారు. బీఆర్ఎస్ సభకు తెలంగాణతో పాటు ఏపీ, ఛత్తీస్ గఢ్ నుంచి జనాలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పార్కింగ్ కే 400 ఎకరాలు కేటాయించారు. బీఆర్ఎస్ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రెండు వారాలుగా ఖమ్మం సభ కోసమే పని చేస్తున్నారు. భారీ బహిరంగ సభలో బల ప్రదర్శన చేసి.. పొంగులేటి పోయినా పర్వాలేదని అనిపించి.. ఖమ్మంను బీఆర్ఎస్ కు ఏకపక్షం చేయాలనేది కేసీఆర్ ఆలోచన అంటున్నారు.