KTR: దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో మంత్రి కేటీఆర్ మేజిక్ చేస్తున్నారు. తెలంగాణకు వరుసగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. మొదటిరోజు లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో పనిచేసే ప్రముఖ అంతర్జాతీయ సంస్థ ‘సీ4ఐఆర్’ (సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్) తమ సెంటర్ ను హైదరాబాద్ ఏర్పాటు చేసేలా రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికా, బ్రిటన్ తర్వాత..
ఇండియాలోనే సీ4ఐఆర్ సెంటర్ ఏర్పాటు కాబోతోంది.
కట్ చేస్తే.. దావోస్ లో రెండోరోజూ తెలంగాణకు బడా సంస్థలను ఆకర్షించారు మంత్రి కేటీఆర్. లండన్ తరువాత రెండో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు అపోలో టైర్స్ ముందుకొచ్చింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి కేటీఆర్ సమక్షంలో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, అపోలో టైర్స్ లిమిటెడ్ వీసీ, ఎండీ నీరజ్ కన్వర్ అగ్రిమెంట్ పై సంతకాలు చేశారు.
ఐవోటీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్, బ్లాక్ చైన్ వంటి వినూత్న సాంకేతికతలను ఉపయోగించుకుని, కొత్త వ్యాపార నమూనాలను అభివృద్ధి చేయనున్నట్టు అపోలో టైర్స్ ప్రకటించింది. భవిష్యత్ ప్రణాళికల కోసం డిజిటలైజేషన్ ఎంతో కీలకమని.. లండన్ తరువాత హైదరాబాద్లో డిజిటల్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం సంస్థ డిజిటల్ వ్యూహంలో భాగమని తెలిపింది.
మరోవైపు, తెలంగాణలో మల్టీ గిగావాట్ లిథియం క్యాథోడ్ బ్యాటరీస్ తయారీ కేంద్రం ఏర్పాటు కానుంది. అలాక్స్ అడ్వాన్స్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 750 కోట్లతో కేంద్రాన్ని నెలకొల్పనుంది. దావోస్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో అలాక్స్ సంస్థ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నారు.