DharmaNayak: వారం క్రితం ఓ బ్రేకింగ్ న్యూస్ నడిచింది. అన్ని ఛానెళ్లలోనూ ఆ వార్త బాగా హైలెట్ అయింది. మెదక్ జిల్లాలో ఓ వ్యక్తి కారుతో సహా సజీవదహనం అయ్యాడనేది ఆ న్యూస్. కాసేపటికి చనిపోయింది ధర్మానాయక్ గా గుర్తించారు పోలీసులు. ధర్మ ఎలా చనిపోయాడు? కారు ఎలా కాలిపోయింది? ఎవరైనా చంపేసి, కాల్చేశారా? ధర్మానాయకే ఆత్మహత్య చేసుకున్నాడా? లేదంటే, కారుకు ప్రమాదం జరిగి ఇలా అయిందా? ఇలా రకరకాల కోణాల్లో పోలీసులు విచారించారు. చివరాఖరికి తేలిన విషయం చూసి అంతా ఉలిక్కిపడ్డారు. ఇంతకీ ధర్మానాయక్ ఎలా చనిపోయాడంటే…
ఆగండాగండి.. అసలు ధర్మానాయక్ చనిపోలేదు.. అతను బతికే ఉన్నాడు. ఆ కారులో కాలిపోయింది ధర్మ కాదు.. అతని డ్రైవర్. ఇదంతా ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆడిన నాటకంగా తేల్చారు పోలీసులు. ధర్మానాయక్ గోవాలో జల్సాలు చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
ఈ నెల 9న మెదక్ జిల్లాలోని టేక్మాల్ మండలం వెంకటాపురం దగ్గర కారులో వ్యక్తి సజీవదహనం అయ్యాడు. చనిపోయింది భీమ్లా తండాకు చెందిన ధర్మగా పోలీసుల దర్యాప్తులో తేలింది. హైదరాబాద్ సెక్రటేరియేట్లో సీనియర్ అసిస్టెంట్గా ఆయన పని చేస్తున్నారు. ధర్మ భార్య నీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఘటనా స్థలంలో పెట్రోల్ డబ్బా దొరకడంతో పోలీసులు ఈ కేసును సవాల్గా తీసుకున్నారు. పోలీస్ దర్యాప్తులో భాగంగా ధర్మానాయక్ సెల్ఫోన్ సిగ్నల్స్ గోవాలో ఉన్నట్టు తెలిసింది. తను ఇంకా బతికే ఉన్నాడని భావించిన పోలీసులు.. వెంటనే ఓ స్పెషల్ టీమ్ ను గోవాకి పంపించి ధర్మాను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు.
ధర్మానాయక్ ను పోలీస్ స్టైల్ లో విచారించగా సినిమాటిక్ ట్విస్ట్ బయటపడింది. ధర్మ బెట్టింగ్లు ఆడి అప్పుల పాలయ్యాడని.. బీమా డబ్బులు వస్తే అప్పులు తీర్చొచ్చని భావించాడు. డ్రైవర్ను చంపి.. కారులో ఉంచి.. పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. చనిపోయింది తానే అన్నట్టు అతని భార్యతో నాటకం రక్తి కట్టించాడని పోలీసులు గుర్తించారు.