KTR: దావోస్, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో మరోసారి తెలంగాణ పేరు మారుమోగిపోతోంది. మొదటి రోజే ఓ ప్రముఖ అంతర్జాతీయ సంస్థకు గాలం వేసి పట్టారు కేటీఆర్. సీ4ఐఆర్ (సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్) కు చెందిన సెంటర్ను హైదరాబాద్లో ఏర్పాటు చేయనున్నారు. దావోస్ వేదికగా మంత్రి కేటీఆర్ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఆ మేరకు ఒప్పందం కుదిరింది.
లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగాల్లో సీ4ఐఆర్ సంస్థ పని చేస్తుంది. భారత దేశంలో సీ4ఐఆర్ విభాగాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ప్రస్తుతం అమెరికా, బ్రిటన్ దేశాల్లో ఇలాంటి కేంద్రాలు ఉన్నాయి.
సీ4ఐఆర్ సెంటర్ ఏర్పాటు కోసం హైదరాబాద్ను సెలెక్ట్ చేసుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు కేటీఆర్. లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అనుకూలతలు, సత్తాకు ఈ కేంద్రం ఏర్పాటే నిదర్శనం అన్నారు. లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ రంగంలో ఉన్న అవకాశాలను భారతదేశం అందిపుచ్చుకోవడానికి ఈ కేంద్రం ఏర్పాటు ఉపయోగపడుతుందని కేటీఆర్ చెప్పారు.