Chandrababu: చంద్రబాబును వెంటాడుతున్నారు. చంద్రబాబు ఎక్కడికి వెళితే అక్కడ పోలీసులు ఆంక్షల పెడుతున్నారు. ఆఖరికి సొంత నియోజకవర్గం కుప్పంకు కూడా బాబును వెళ్లనీయలేదు. ఇలా తనను పోలీసులు చుట్టుముడుతుండటంపై టీడీపీ అధినేత తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఇదంతా మంత్రి పెద్దిరెడ్డి చేస్తున్నారని అంటున్నారు. పుంగనూరులో టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించి.. వారిని జైలుకు పంపించారని మండిపడుతున్నారు. అందుకే, సంక్రాంతి నాడు నారావారిపల్లె వేదికగా మంత్రి పెద్దిరెడ్డిని వదిలిపెట్టేదే లేదంటూ.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. కనుమ రోజు మరోసారి పెద్దిరెడ్డిపై చెలరేగిపోయారు.
పెద్దిరెడ్డి పనైపోయిందని.. బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు. అక్రమ కేసులు పెడితే ఊరుకునేది లేదని.. ఇకనైనా పద్ధతి మార్చుకోండని పోలీసులకు హితవు పలికారు. అన్నమయ్య జిల్లా పీలేరు సబ్ జైలులో ఉన్న పుంగనూరు టీడీపీ నేతలు, కార్యకర్తలను పరామర్శించారు చంద్రబాబు. జైల్లో వారితో ములాఖత్ అయ్యారు.
చంద్రబాబు వచ్చారని తెలిసి.. పెద్దఎత్తున పార్టీ కార్యకర్తలు జైలు దగ్గరికి తరలివచ్చారు. పోలీసులు టీడీపీ శ్రేణులను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య స్వల్ప వాగ్వాదం, తోపులాట జరిగింది.
టీడీపీ ఫ్లెక్సీలు ఎందుకు చింపారని ప్రశ్నిస్తే కేసులు పెడతారా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు చంద్రబాబు. “ఏం తప్పు చేశారని టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారు? అక్రమ కేసులు పెట్టి తీవ్రంగా కొడతారా? తప్పు ఒప్పుకోవాలని ఒత్తిడి చేస్తారా? సీఐ, ఎస్సై చాలా దారుణంగా వ్యవహరించారు.. భయపెట్టి మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.. నన్ను పీలేరు రాకుండా అడ్డుకుంటారా? నేనెక్కడికి వస్తే అక్కడ పోలీసు యాక్టు 30 పెడతారా? ఎంతమందిని జైల్లో పెడతారో మేమూ చూస్తాం.” అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు.
మరోవైపు, చంద్రబాబు గో బ్యాక్ అంటూ పీలేరులో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి. మత కలహాలు సృష్టిస్తున్న సైకో చంద్రబాబు గోబ్యాక్ అంటూ పలుచోట్ల ఫ్లెక్సీల ఏర్పాటు చేశారు వైసీపీ శ్రేణులు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ గుండాలు దాడులు చేస్తే ఊరుకోవాలా అని ప్రశ్నిస్తూ గాయపడిన వారి ఫోటోలను ఫ్లెక్సీల్లో వేశారు.