Sharechat: షేర్ చాట్. ఉదయం లేవగానే ఈ పేరు చూస్తుంటారు.. వింటుంటారు. వాట్సాప్ స్టేటస్సుల్లో, సోషల్ మీడియా ప్లాట్ ఫాంస్ లో.. ఎక్కడ చూసినా షేర్ చాటే న్యూసు, వీడియోస్ కనిపిస్తుంటుంది. ‘మోజ్’ యాప్ సైతం ఆ కంపెనీదే. దేశవ్యాప్తంగా స్థానిక భాషల్లో కంటెంట్ అందిస్తూ.. తక్కువ టైమ్ లోనే ఫుల్ పాపులారిటీ సంపాదించింది. ఇంతబాగా వర్కవుట్ అవుతుంటే.. ఇప్పుడేమో ఆ సంస్థ భారీ సంఖ్యలో ఉద్యోగులను తీసివేసింది.
ప్రముఖ సోషల్ షేరింగ్ యాప్ షేర్చాట్ (Sharechat) మాతృ సంస్థ మొహల్లా టెక్ భారీ సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన (Lay offs) పలికింది. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా దాదాపు 600 మందిని తొలగించింది. ప్రస్తుతం కంపెనీలో దాదాపు 2,100 మంది పనిచేస్తుంటే.. అందులో 20 శాతం మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించేసింది. గతంలో పెట్టుబడులు బాగా రావడంతో.. భారీ సంఖ్యలో ఉద్యోగుల్ని నియమించుకున్న సంస్థ.. ఇప్పుడు నిధులు తగ్గడంతో అధికంగా ఉన్న ఉద్యోగులను తీసివేసింది. గత డిసెంబర్లో కంపెనీకే చెందిన జీత్ 11 ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ఫామ్ను మూసేయడంతో అందులో పనిచేసే 115 మంది ఉద్యోగాలు కోల్పోయారు. నెల రోజుల వ్యవధిలోనే షేర్ చాట్లో 20 శాతం మందిని తొలగించడం చర్చనీయాంశం అవుతోంది. ఐఐటీలో చదివిన సత్యదేవ, ఫరీద్ అషన్, భాను సింగ్ లు 2015లో షేర్చాట్ యాప్ను స్టార్ట్ చేశారు.
తొలగించిన ఉద్యోగులకు 2022 డిసెంబర్ వరకు 100 శాతం వేరియబుల్ పేని చెల్లించనున్నట్టు కంపెనీ తెలిపింది. నోటీసు పీరియడ్ కాలానికి పూర్తి జీతం ఇవ్వనుంది. పనిచేసిన కాలానికి గానూ ఏడాదికి రెండు వారాల చొప్పున ఎక్స్గ్రేషియా కూడా ఇస్తామని ప్రకటించింది. 2023 జూన్ వరకు ఆరోగ్య బీమా కంటిన్యూ చేస్తామని చెప్పింది. ఇవన్నీ సరేగానీ.. ఉద్యోగాలు కోల్పోయిన 600 మందికి ఇప్పటికిప్పుడు అలాంటి జాబ్సే ఎక్కడ దొరుకుతాయి? డబ్బులున్నాయని ఎక్కువ సంఖ్యలో ఉద్యోగులను తీసుకోవడం ఎందుకు.. ఖర్చు తగ్గించుకునేందుకు ఇచ్చిన ఉద్యోగాలను తీసి వేయడం ఎందుకు? అంటూ మండిపడుతున్నారు బాధితులు.