IND vs SL: టీమిండియా బ్యాటర్స్ చెలరేగిపోయారు. శ్రీలంక బౌలింగ్ ను చితక్కొట్టుడు కొట్టారు. 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 390 పరుగుల భారీ స్కోరు చేసింది. శ్రీలంక ముందు బిగ్ టార్గెట్ ఉంచింది.
విరాట్ కోహ్లీ మళ్లీ వీరవిహారం చేశాడు. 110 బంతుల్లో ఏకంగా 166 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. 13 ఫోర్లు, 8 సిక్స్ లతో తిరువనంతపురంలో విరాటపర్వం ఆవిష్కరించారు.
కోహ్లీతో పాటు శుభ్ మన్ గిల్ సైతం బ్యాట్ ఝలిపించాడు. 97 పరుగుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్ లతో గిల్ 116 పరుగులు బాదేశాడు.
కెప్టెన్ రోహిత్ శర్మ 42 పరుగులతో శుభారంభం అందించగా.. శ్రేయస్ 38 రన్స్ తో రాణించాడు. రాహుల్ (7), సూర్య (4) పరుగులు చేశారు.
శ్రీలంక బౌలర్లలో లాహిరు కుమారా, రజిత చెరో 2 వికెట్లు పడగొట్టారు. కరుణరత్నె ఒక వికెట్ తీశాడు.
తిరువనంతపురం మ్యాచ్ లో కాసేపు ఆందోళనకర పరిస్థితి నెలకొంది. కరుణరత్నె బౌలింగ్లో విరాట్ కోహ్లీ బౌండరీ కొట్టగా.. ఆ బంతిని ఆపేందుకు ఫీల్డర్లు వాండర్సే, అషేన్ బండారా పరుగెత్తారు. ఆ క్రమంలో ఒకరినొకరు చూసుకోకుండా ఢీకొట్టుకోవడంతో గాయపడ్డారు. బండారాను స్ట్రెచర్ మీద ఆసుపత్రికి తరలించారు. వాండర్సే కూడా గాయపడినప్పటికీ.. అతడి పరిస్థితి నిలకడగానే ఉంది.
వన్డేల్లో 46 సెంచరీలు చేసిన కోహ్లీ.. సచిన్ తెందూల్కర్ పేరుపై ఉన్న రెండు రికార్డులు బద్దలుకొట్టాడు. స్వదేశంలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ గా సచిన్ రికార్డును బ్రేక్ చేశాడు. లేటెస్ట్ సెంచరీతో భారత్ లో కోహ్లీ శతకాల సంఖ్య 21కి చేరింది. 20 సెంచరీలతో సచిన్ సెకండ్ హయ్యెస్ట్ కి వెళ్లిపోయాడు.
ఇక, ఒకే జట్టుపై అత్యధిక శతకాలు బాదిన బ్యాటర్గానూ కోహ్లీ రికార్డులకెక్కాడు. శ్రీలంకపై 10 సెంచరీలతో సచిన్ రికార్డును అధిగమించాడు కోహ్లీ. మరోవైపు, వన్డేల్లో అత్యధిక శతకాలు చేసిన బ్యాట్స్ మెన్ గా సచిన్ (49) స్కోరుకు మరింత దగ్గరగా వచ్చాడు విరాట్ కోహ్లీ(46). ఇంకో మూడు సెంచరీలు చేస్తే.. సచిన్ తో సమానం అయిపోతాడు. నాలుగు సెంచరీలు సాధిస్తే.. విరాట్ నెంబర్ 1 గా నిలుస్తాడు.
అటు, 12,754 రన్స్ తో వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ల జాబితాలో ఐదో స్థానంలోకి ఎగబాకాడు కోహ్లీ. సచిన్ 18,426 పరుగులతో అందరికంటే ముందున్నాడు.