Vande Bharat: వందే భారత్ ఎక్స్ ప్రెస్. దేశవ్యాప్తంగా ఊదరగొడుతున్న పేరు. కేంద్రం, బీజేపీ ఈ రైలుకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ప్రతీ రైలును ప్రధాని మోదీనే స్వయంగా ప్రారంభిస్తున్నారు. ఇప్పటికి 8 రైళ్లకు పచ్చజెండా ఊపారు. ఓ ప్రధాని వరుసబెట్టి ఇలా రైళ్లను ఆరంభిస్తుండటం రాజకీయంగా ఆసక్తికర విషయమే.
స్పీడ్ గా వెళ్తుంది.. లోపల సీట్లు బాగుంటాయి.. అంతా ఏసీనే.. సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి.. ఇంతేగా. ఇంతకంటే ఇంకేమైనా స్పెషాలిటీ ఉందా? అని ప్రశ్నిస్తున్నారు కొందరు. ఇదంతా సరే మరి టికెట్ రేటు ఎంతుందో కూడా బాగా ప్రచారం చేయండంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.
వందేభారత్ ఎక్స్ ప్రెస్ ఎక్కాలంటే చేతి చమురు వదలాల్సిందే. మామూలు ట్రైన్ టికెట్స్ కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. విశాఖ నుంచి సికింద్రాబాద్ కు ఛైర్ కార్ అయితే రూ.1720.. ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ అయితే రూ.3170. మరి, అంతేసి టికెట్లు పెట్టి ఎవరు ప్రయాణిస్తారు? సామాన్యులు వందే భారత్ టికెట్ ధరలు భరించగలరా? డబ్బున్న వారి కోసమేనా ఈ ట్రైన్? ఇలా నెటిజన్లు సోషల్ మీడియాలో కుమ్మేస్తున్నారు.
బీజేపీ బడాబాబులకు ఫేవర్ చేసే పార్టీ అనే విమర్శ ఉంది. మోదీ తన ఇద్దరు మిత్రులు అంబానీ, అదానీల కోసమే పని చేస్తారని రాహుల్ గాంధీ పదే పదే ఆరోపిస్తుంటారు. మాల్యా, చోక్సీ, మోదీలను దేశం నుంచి దాటించేశారని కూడా అంటారు. అప్పర్ కేటగిరి ప్రజలకు మాత్రమే ఉపయోగపడే వందే భారత్ ఎక్స్ ప్రెస్ లను తీసుకొచ్చి.. దేశ ప్రజలను ఏదో ఉద్దరించినట్టు.. ప్రచార డాంభికాలకు పోతున్నారంటూ కాంగ్రెస్ మండిపడుతోంది. పేదలు, సామాన్యులకు అసలేమాత్రం పనికిరాని వందే భారత్ కు ఇంతటి హడావుడి, ఆర్భాటం, ప్రచారం అవసరమా? అంటూ ప్రశ్నలు సంధిస్తోంది.
సామాన్యులకు అందుబాటులో లేని వందే భారత్కు ఎందుకంత ప్రచారమంటూ మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. సాక్షాత్తు దేశ ప్రధాని, ఇద్దరు కేంద్ర మంత్రులు, గవర్నర్ అందరూ ఒక రైలుకు విస్తృత ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నించారు.
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి ఇదే మొదటి రైలు కాదని, ప్రస్తుతం 17 రైళ్ నడుస్తున్నాయని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్ 18వ రైలు అని పొన్నాల విమర్శించారు. ప్రజోపయోగ కార్యక్రమాలపై దృష్టి పెట్టకుండా కొత్త పేర్లు, కొత్త నినాదాలు, ప్రచారాలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారని తప్పుబట్టారు. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత పార్లమెంట్ సాక్షిగా చేసిన విభజన చట్టంలోని అంశాలు 8 ఏళ్లలో ఏ ఒక్కటైనా నెరవేర్చారా? అని నిలదీశారు కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య.