Teachers: టీచర్లను టచ్ చేసి చూడండి.. ఎప్పుడూ సర్కార్ పై ఏదో ఒక అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. ఉపాధ్యాయులు వారికి వ్యతిరేకంగానే ఉంటారు. ఆ డిమాండ్ నెరవేర్చలేదని.. ఈ పని చేయలేదని.. ప్రభుత్వ వైఫల్యాలను తరుచూ ఎండగడుతుంటారు. కేసీఆర్ సర్కారు మీదా టీచర్లు గుర్రుగానే ఉన్నారు. కానీ, ఉపాధ్యాయ సంఘాలను ప్రభుత్వం తమ చెప్పుచేతల్లో పెట్టుకోవడంతో.. వారెవరూ బయటపడటం లేదు. అయితే, మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనుండటంతో.. ప్రభుత్వం అలర్ట్ అయింది. ఎన్నికల సరళిని ప్రభావితం చేసే సత్తా ఉన్న టీచర్లతో మనకెందుకులే అనుకుందో ఏమో.. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న డిమాండ్లను నెరవేరుస్తోంది.
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి హరీష్ రావు నివాసంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆ శాఖ అధికారులు, పీఆర్టీయూ నేతలు సమావేశమయ్యారు. పదోన్నతులు, ప్రమోషన్లకు సంబంధించిన షెడ్యుల్ను రెండు రోజుల్లో రిలీజ్ చేయాలని నిర్ణయించారు.
ఫిబ్రవరి 10వ తేదీ నాటికి ట్రాన్స్ ఫర్స్, ప్రమోషన్స్ ప్రక్రియ పూర్తి చేసేవిధంగా షెడ్యుల్ ఖరారు చేస్తున్నారు. అయితే, ఫిబ్రవరిలో ఈ ప్రక్రియ ముగిసినప్పటికీ.. బదిలీలు మాత్రం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలులోకి వచ్చే విధంగా విధివిధానాలు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ అకాడమిక్ ఇయర్ ప్రారంభంలోనే బదిలీలు, పదోన్నతులు పూర్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేసినా సర్కారు పట్టించుకోలేదు. జీవో నెం. 317తో స్థానికత నిబంధనల మేరకు కొత్త జిల్లాలకు అనుగుణంగా ఉపాధ్యాయుల కేటాయింపు జరిగింది. అందుకే బదిలీలు ఆలస్యం అయిందని సర్కారు చెబుతోంది. ఈ విషయంలో టీచర్లు అసంతృప్తితో ఉన్నారని గుర్తించిన ప్రభుత్వం.. తాజాగా సాధ్యమైనంత త్వరగా పదోన్నతులు, ప్రమోషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. ఆ తర్వాతైనా.. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తారా? అనే ఆసక్తి నిరుద్యోగుల్లో మొదలైంది.