Nepal: ఎయిర్ పోర్టులో విమానం టేకాఫ్ కు రెడీగా ఉంది. విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. అంతా సీట్ బెల్ట్ పెట్టుకున్నారు. కౌంట్ డౌన్ మొదలైపోయింది. విమానం గాల్లో ఎగిరింది. అంతా రిలాక్స్ అయ్యారు. కాసేపట్లో గమ్యానికి చేరుకుంటామనగా.. ఉన్నట్టుండి విమానం కుదుపులకు లోనైంది. ప్రయాణికులు టెన్షన్ పడ్డారు. ఏమందో ఏమోనని హడలిపోయారు. అంతలోనే విమానం కుప్పకూలింది. భారీగా మంటలు చెలరేగాయి. 45 మందికి పైగా మృతి చెందినట్టు తెలుస్తోంది. మృతుల్లో ఐదుగురు భారతీయులు ఉన్నారంటున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది.
కాఠ్మాండూ నుంచి కాస్కీ జిల్లాలోని పొఖారాకు బయల్దేరిన యతి ఎయిర్లైన్స్కు చెందిన ఏటీఆర్ 72 విమానం కుప్పకూలింది. ఈ ఘటన పొఖారా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో జరిగింది. ఒక్క రెక్క మినహా విమానం మొత్తం కాలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న వారు ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడే అవకాశాలు చాలా తక్కువని చెబుతున్నారు. ఆ విమానంలో 10 మంది విదేశీయులు ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రమాదంపై నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ విచారం వ్యక్తం చేశారు. అత్యవసర మంత్రి వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భద్రతా దళాలు, హోంశాఖ వెంటనే సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేపాల్ విమాన ప్రమాదంతో పలు భారతీయ కుటుంబాల్లో విషాదం నెలకొంది.