Nizam: హైదరాబాద్ నిజాం కన్నుమూశారు. టర్కీలోని ఇస్తాంబుల్ లో తుది శ్వాస విడిచారు. ఈ నెల 17న నిజాం భౌతికకాయాన్ని నగరానికి తీసుకొచ్చి.. ఇక్కడే అంత్యక్రియలు చేయనున్నారు. ఆ మేరకు నిజాం కుటుంబం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ న్యూస్ చూసినవారికో డౌట్ రావొచ్చు. అదేంటి హైదరాబాద్ నిజాం ఇంకా ఉన్నారా? అనే అనుమానం వచ్చి ఉండొచ్చు. అవును, ఉన్నారు. ఆయన పేరు ముకరంజా బహదూర్. హైదరాబాద్ చిట్టచివరి నిజాం రాజు మిర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్కు మనుమడు.. నిజాం వారసుడు. ముకరం జా బహదూర్ అసలు పేరు మిర్ బర్కత్ అలీ ఖాన్. ఈయన ఎనిమిదో నిజాం. 89 ఏళ్ల వయసులో చనిపోయారు.
శనివారం రాత్రి 10.30 గంటలకు టర్కీలోని ఇస్తాంబుల్లో తుదిశ్వాస విడిచారు. నిజాం కోరిక మేరకు అంత్యక్రియలను హైదరాబాద్లోని అసఫ్ జాహీ ఫ్యామిలీ టూంబ్స్లో నిర్వహించనున్నారు.
మిర్ హిమాయత్ అలీ ఖాన్ ఉరఫ్ అజం జా బహదూర్, ప్రిన్సెస్ డుర్రు షెవర్ దంపతుల కుమారుడే ముకరంజా బహదూర్. 1933 అక్టోబరు 6న జన్మించారు. ప్రిన్సెస్ డుర్రు షెవర్.. టర్కీ చివరి సుల్తాన్ కుమార్తె. ఇటు తండ్రి నుంచి, అటు తల్లి తరఫున లెక్కలేనంత సంపదకు వారసుడు ఈ ఎనిమిదో నిజాం ప్రభువు.