Vande Bharat: వందేభారత్ ఎక్స్ప్రెస్ తెలుగు రాష్ట్రాల్లో హైస్పీడ్ తో దూసుకెళ్లింది. ఢిల్లీలో ప్రధాని మోదీ పచ్చజెండా ఊపగానే.. ఇక్కడ సికింద్రాబాద్ లో వందేభారత్.. కూత పెట్టింది. చుక్ చుక్ అనకుండానే.. జెట్ స్పీడ్ తో పట్టాలపై పరుగులు పెట్టింది. అలా, తొలి సెమీ హైస్పీడ్ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు తెలుగు రాష్ట్రాల మధ్య ఆరంభమైంది.
సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును ఆదివారం ఉదయం 10:30 గంటలకు ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్గా ప్రారంభించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, పర్యాటక శాఖ మంత్రి కిషన్రెడ్డి, రైల్వే శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆదివారం మినహా వారంలో ఆరు రోజుల పాటు ఈ రైలు అందుబాటులో ఉండనుంది.
‘‘పండగ వాతావరణంలో తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ గొప్ప కానుక. తెలుగు ప్రజలకు వందేభారత్ ఎక్స్ప్రెస్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రైలు ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వేగవంతమైన ప్రయాణానికి దోహదపడుతుంది. హైదరాబాద్- వరంగల్ – విజయవాడ – విశాఖ నగరాలను అనుసంధానిస్తూ ప్రయాణం సాగుతుంది. సికింద్రాబాద్ – విశాఖ మధ్య ప్రయాణ సమయం కూడా తగ్గుతుంది. పూర్తిగా దేశీయంగా తయారైన వందేభారత్తో బహుళ ప్రయోజనాలున్నాయి. అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేరుస్తుంది. భద్రతతో పాటు రైలు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. 2023లో ప్రారంభిస్తున్న తొలి వందేభారత్ రైలు ఇది. మారుతున్న దేశ భవిష్యత్తుకు ఇదొక ఉదాహరణ’’ అంటూ పీఎం మోదీ తెలుగు ప్రజలకు తన సందేశాన్ని ఇచ్చారు.
వారంలో ఆరు రోజులు ఉదయం 5.45 గంటలకు విశాఖలో వందేభారత్ ఎక్స్ ప్రెస్ (20833) బయలు దేరుతుంది. మధ్యాహ్నం 2.15 కల్లా సికింద్రాబాద్ చేరుతుంది. తిరిగి సికింద్రాబాద్ లో (20834) మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై.. రాత్రి 11.30కి విశాఖ చేరుతుంది.