Sabarimala: స్వామియే శరణం అయ్యప్ప. స్వామి శరణం.. అయ్యప్ప శరణం. శబరిగిరిలు మారుమోగిపోయాయి. భక్తుల నామస్మరణతో శబరిమల హోరెత్తింది. అయ్యప్ప ఆలయ ప్రాంగణమంతా భక్తులే. శబరిగిరుల నిండా భక్తులే. లక్షల సంఖ్యలో ఉన్నారు. ఉన్నట్టుండి అంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. దూరంగా ఉన్న పొన్నాంబలంమేడు పర్వత శిఖరాల వైపు భక్తితో చూస్తున్నారు. కనురెప్పలు కొట్టడం ఆపేశారు. రెప్పపాటులో ఆ స్వామి దర్శనం ఎక్కడ మిస్ అయిపోతామేమోననే ఆరాటం. అంతా తీక్షణంగా చూస్తుండగా.. దూరంగా.. కొండ శిఖరంపైన.. జ్యోతి దర్శనం. జ్యోతి స్వరూపంలో అయ్యప్ప దర్శనం. మూడుసార్లు మకర జ్యోతి దర్శనం ఇచ్చారు అయ్యప్ప స్వామి. భక్తులంతా తన్మయత్మంలో మునిగిపోయారు. జ్యోతి దర్శనంతో పులకించి పోయారు. ఇక మళ్లీ స్వామి శరణం.. అయ్యప్ప శరణం.. నినాదాలతో శబరిమల దద్దరిల్లిపోయింది.
హరిహరక్షేత్రం శబరిమలకు.. మకర సంక్రాంతి సందర్భంగా జ్యోతి దర్శనం కోసం లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. కాంతమాల కొండలపై దేవతలు, రుషులు కలిసి భగవంతునికి హారతి ఇస్తారని భక్తుల విశ్వాసం. ఆలయానికి ఈశాన్య దిశలో పర్వతశ్రేణుల నుంచి జ్యోతి దర్శనమిచ్చింది. జ్యోతి దర్శనంతో భక్తులు పులకించిపోయారు. శరణుఘోషలతో శబరిగిరులు ప్రతిధ్వనించాయి.
అంతకుముందు, పందాళం నుంచి తీసుకువచ్చిన తిరువాభరణాలను ప్రధాన అర్చకులు స్వామివారికి అలంకరించారు. అనంతరం మూలమూర్తికి హారతి ఇచ్చారు. ఆ వెంటనే పొన్నాంబలంమేడు పర్వత శిఖరాల్లో జ్యోతి దర్శనమిచ్చింది. భక్తులు స్వామియే శరణం అయ్యప్ప అంటూ శరణమిల్లారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అయ్యప్ప భక్తులు భారీగా శబరిమలకు తరలివచ్చారు. జ్యోతి దర్శనం తర్వాత అయ్యప్ప దర్శనానికి బారులు తీరారు.