Sankranti Pooja: సంక్రాంతికి రోజున శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేయడం మంచిది. సంక్రాంతి రోజున ఉపవాసం వుండి… పవిత్ర నదుల్లో పుణ్యస్నానం చేయాలి. నల్లనువ్వుల పిండితో శరీరానికి నలుగు పెట్టి తలస్నానం చేస్తుంటారు. రవి సంక్రమణం రోజున స్నానం చేయని నరుడు ఏడు జన్మలదాకా రోగి అవుతాడని శాస్త్రాలు చెబుతున్నాయి.
సంక్రాంతి రోజు నిష్టతో, శుచిగా మహాదేవుని, సూర్యదేవుడిని పూజిస్తే వారికి శనీశ్వర దోషాలు తొలగిపోతాయి. రవి సంక్రమణం అయ్యే సంక్రాంతి రోజున నువ్వుల పిండితో స్నానం.. నువ్వులతో చేసిన పిండి వంటలు తీసుకోవడం ద్వారా శనీశ్వరుని నుంచి ఏర్పడే ఈతిబాధలు తొలగిపోతాయి. మకర సంక్రాంతి నాటికి వంట ఇంటికి చేరడం ద్వారా సర్వత్రా ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించే సంక్రాంతి రోజున ఆవునెయ్యితో శివుడికి అభిషేకం చేయడం శ్రేయస్కరం. ఇలాచేస్తే అన్ని భోగాలు ప్రాప్తించి మోక్షం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
అందుకే సంక్రాంతి రోజున నువ్వుల నూనె రాసుకుని.. నల్ల నువ్వుల పిండితో నలుగు పెట్టి అభ్యంగన స్నానం చేయాలి. సంక్రాంతి రోజున ఫలాలు, ధాన్యం, వస్త్రాలు, గుమ్మడి, కూరగాయలు, దుంపలు, చెరకు మొదలైన వాటిని దానం చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. పితృరుణం, మానవ రుణం, దేవరుణం, రుషి రుణం, భూతరుణం నుంచి విముక్తి పొందే మార్గాలను సంక్రాంతి నిర్దేశిస్తుంది.
ఇంద్ర, వరుణ, వాయు దేవతల సాయంతో సూర్యుడు భూమిపై వర్షాన్ని కురిపించడం ద్వారా మకర సంక్రాంతి నాటికి పంటలు సమృద్ధిగా పండి మనిషి జీవన పోషణ జరుగుతుంది. అందుకే శుచిగా స్నానమాచరించి సూర్యునితోపాటు ఇతర దేవతలను భక్తితో పూజించాలంటారు. కొత్త బియ్యంతో పొంగలి తయారుచేసి పాలను పొంగించి సూర్యభగవానుడికి భక్తితో కృతజ్ఞతతో నివేదిస్తారు.