Sankranti : సంక్రాంతి వేళ భాగ్యనగర వాసులు సొంతూళ్ల బాట పట్టారు. రద్దీకి అనుగుణంగా టీఎస్ ఆర్టీసీ, ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నాయి. అటు ప్రైవేట్ ట్రావెల్స్ హైదరాబాద్ నుంచి సర్వీసులను పెంచాయి. సొంతకార్లు ఉన్నవారు కుటుంబ సమేతంగా ఆ వాహనాలలోనే సొంతూళ్లకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది.
పండుగకు ఒక రోజు ముందు నుంచే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సెలవులు ప్రకటించడంతో హైదరాబాద్లో నివసించే ప్రజలు తమ స్వగ్రామాలకు వెళుతున్నారు. గురువారం సాయంత్ర నుంచి రద్దీ మరింత పెరిగింది. ఒకే సమయంలో వాహనాలు వేల సంఖ్యలో తరలిరావడంతో యాదాద్రి జిల్లాలోని పంతంగి టోల్ ప్లాజా ను దాటేందుకు వాహనదారులకు చాలా సమయం పడుతోంది. ఫాస్టాగ్ విధానం అమలులో ఉన్నా వాహనాలు పరిమితికి మించి రావడం, కొన్ని వాహనాల ఫాస్టాగ్లు స్కాన్ కాకపోవడంతోనే కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయని టోల్ ప్లాజా నిర్వాహకులు చెబుతున్నారు. రాచకొండ పోలీసులు, జీఎంఆర్ టోల్గేట్ సిబ్బంది వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నారు. ఉంగుటూరు ట్లోల్ ప్లాజా వద్ద ఇదే పరిస్థితి నెలకొంది.
తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లోని టోల్ ప్లాజాల వద్ద పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంపై టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. సొంత వాహనాల్లో ఊళ్లకు వెళ్తూ టోల్ ప్లాజాల వద్ద సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. గంటల తరబడి టోల్ ప్లాజాల వద్ద నిరీక్షించవద్దన్నారు. అందుకే టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని ప్రజలను కోరారు. టోల్ ప్లాజాల వద్ద ఆర్టీసీ బస్సులకు ప్రత్యేక లేన్లు ఏర్పాటు చేయడం వల్ల వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చని అన్నారు. ప్రయాణికులను ఆర్టీసీ సిబ్బంది క్షేమంగా సొంతూళ్లకు చేర్చుతారనిఅని సజ్జనార్ భరోసా కల్పించారు.