Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యగా థియేటర్లలో సందడి చేస్తున్నారు. మాస్ ఎంటర్టైనర్గా బాబీ తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 1200 థియేటర్లలో విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద మెగా మేనియా కనిపిస్తోంది. అభిమానులు థియేటర్ల వద్ద భారీ కటౌట్లు ఏర్పాటు చేసి.. పాలాభిషేకాలు చేస్తున్నారు. టపాసుల కాల్పులు, తీన్ మార్ డ్యాన్స్లతో థియేటర్ ప్రాంగణాలు హోరెత్తుతున్నాయి.
థియేటర్లలోనూ మాస్ జాతర కనిపిస్తోంది. మెగాస్టార్ స్టెప్పులు, ఇంటర్వెల్ సీక్వెన్స్, రవితేజ-చిరు కాంబో సీన్స్ ఫ్యాన్స్ కు పునకాలు రప్పిస్తున్నాయి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్రోడ్స్లోని సంధ్య థియేటర్లో తెల్లవారుజామున 4గంటలకే వాల్తేరు వీరయ్య షో పడింది. ఇక్కడ చిరంజీవి కుమార్తెలు శ్రీజ, సుస్మిత, చిత్ర దర్శకుడు బాబీ, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్.. అభిమానులతో కలిసి సినిమాను వీక్షించారు.
వాల్తేరు వీరయ్య ఫస్ట్ షో ముగిసిన వెంటనే సినిమా చూసిన ప్రేక్షకులు ట్విటర్లో తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య కథేంటి? ఎలా ఉంది? ఇలాంటి ఆసక్తికర అంశాలను ట్విటర్ వేదికగా వెల్లడిస్తున్నారు. సినిమా అదిరిపోయిందని, చిరంజీవి డ్యాన్స్, యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయని కొందరు ట్వీట్ లు చేశారు. ఇంటర్వెల్ బ్యాంగ్ అదుర్స్ అని మరికొందరు కామెంట్ చేశారు. ఫస్టాఫ్ ర్యాంప్, ఇంట్రో, బాస్ పార్టీ సాంగ్, కామెడీ, ఇంటర్వెల్ సీన్ ఆకట్టుకుంటాయని ఫ్యాన్స్ అంటున్నారు. రవితేజ, చిరు మధ్య సీన్స్ బాగున్నాయని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. కామెడీ బాగుందని కూడా బాగుందని అభిమానులు అంటున్నారు. మొత్తంగా ఓ మాస్ ఎంటర్ టైనర్ గా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పొన్నూరులో థియేటర్ అద్దాల ధ్వంసం..
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని శ్రీలక్ష్మీ థియేటర్లో ఓ అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున బెనిఫిట్ షో చూసేందుకు థియేటర్ వద్దకు భారీగా అభిమానులు తరలివచ్చారు. సాంకేతిక లోపంతో సినిమాను ప్రదర్శించలేకపోతున్నామని థియేటర్ యాజమాన్యం ప్రకటించింది. ఎంతోసేపు వేచి ఉన్నప్పటికీ ఎలాంటి సమాచారం లేకపోవడంతో అభిమానులు ఆగ్రహానికి లోనై థియేటర్ అద్దాలు పగలగొట్టారు. థియేటర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మెగా ఫ్యాన్స్ ను అక్కడి నుంచి పంపించి వేశారు.