Sarad Yadav : బీహార్ రాజకీయాల్లో విషాదం చోటుచేసుకుంది. 5 దశాబ్దాలపాటు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన శరద్ యాదవ్ ( 75) ఇకలేరు. గురువారం రాత్రి తన నివాసంలోనే స్పృహ కోల్పోయిన ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. అప్పటికి నాడి కొట్టుకోవడం లేదని గురుగ్రామ్లోని ఫోర్టిస్ ఆసుపత్రి తెలిపింది. ఆయన ప్రాణాలు కాపాడేందుకు అత్యవసర చికిత్స అందించినా ఫలితం దక్కలేదని ప్రకటించింది.
రాజకీయ చరిత్ర..
శరద్ యాదవ్కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మధ్యప్రదేశ్లోని హోషంగాబాద్ జిల్లాలో 1947 జులై 1న జన్మించిన శరద్ యాదవ్ రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. 1974లో తొలిసారిగా మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1977లో ఇదే స్థానం మరోసారి గెలిచారు. ఆ తర్వాత 1989లో యూపీలోని బదౌన్ నుంచి ఎంపీగా గెలిచారు. బీహార్ లోని మాధేపుర స్థానం నుంచి 1991, 1996, 1999, 2009లో ఎంపీగా విజయం సాధించారు. అదే స్థానంలో 4 సార్లు ఓడిపోయారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ రెండుసార్లు శరద్ యాదవ్ ను ఓడించారు. మొత్తంగా మూడు రాష్ట్రాల నుంచి శరద్ యాదవ్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు.
బడే భాయ్ గా పేరుగాంచిన శరద్ యాదవ్ ఏడుసార్లు లోక్సభకు, మూడుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1999 నుంచి 2004 మధ్య వాజ్పేయి ప్రభుత్వంలో శరద్ యాదవ్ కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2003లో జేడీ-యూ ఆవిర్భవించాక తొలి జాతీయాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2016 వరకు ఆ పదవిలో కొనసాగారు. 2017లో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఆయనతో విభేదించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు రావడంతో ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని కోల్పోయారు. పార్టీలో పదవుల నుంచి ఆయన్ని తొలగించారు. ఆ తర్వాత 2018లో లోక్తాంత్రిక్ జనతాదళ్ పార్టీని ఏర్పాటు చేశారు. అయితే 2020 మార్చిలో ఆర్జేడీలో ఆ పార్టీని విలీనం చేశారు. ఆ సమయంలో ప్రతిపక్షాలను ఏకం చేయడంలో 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఇది తొలి అడుగని శరద్ యాదవ్ పేర్కొన్నారు.
శరద్ యాదవ్ మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. సుదీర్ఘ ప్రజా జీవితంలో ఆయన విలువైన సేవలు అందించారనీ, డాక్టర్ రామ్మనోహర్ లోహియా సిద్ధాంతాలు ఆయన్ని ప్రభావితం చేశాయని ప్రధాని ట్వీట్ చేశారు. బీహార్ రాజకీయాల్లో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్.. శరద్ యాదవ్ చిరకాల రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు. తమ మధ్య రాజకీయపరంగా వైరుధ్యాలు ఉన్నా.. తమ మధ్య బంధం మాత్రం చెడిపోలేదని లాలూ పేర్కొన్నారు. ప్రస్తుతం సింగపూర్లోని ఆస్పత్రి చికిత్స పొందుతున్న లాలూ.. ఆస్పత్రి నుంచి వీడియో సందేశం పంపారు. శరద్ యాదవ్ను బడే భాయ్ గా సంబోధిస్తూ ఆయనతో ఉన్న అనుబంధాన్ని లాలూ గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.