India won
India Won: శ్రీలంకపై టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్న టీమిండియా ..వన్డే సిరీస్ లో అదే జోరు చూపించింది. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన రెండో వన్డేలో 4 వికెట్ల తేడాతో గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను చేజిక్కించుకుంది.
తొలుత తడబ్యాటు..
216 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తొలుత తడబడింది. రోహిత్ శర్మ ( 17 పరుగులు), శుభ్ మన్ గిల్ (21 పరుగులు), కోహ్లీ (4 పరుగులు) 10 ఓవర్లలోపే పెవిలియన్ కు చేరారు. దీంతో భారత్ 62 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ నినాదంగా ఆడుతూ జట్టు స్కోర్ పెంచేందుకు ప్రయత్నించారు. ఈ దశలో అయ్యర్ (28 పరుగులు ) అవుట్ కావడంతో భారత్ 86 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. కానీ తర్వాత రాహుల్ ( 64 నాటౌట్) కు హార్థిక పాండ్యా ( 36 పరుగులు) జత కలిశాడు. ఈ జోడి తొలుత నెమ్మెదిగా స్కోర్ బోర్డును కదలించింది. ఆ తర్వాత చెలరేగింది. అయితే జట్టు స్కోర్ 161 పరుగుల వద్ద పాండ్యా అవుట్ కావడంతో మళ్లీ టీమిండియాపై ఒత్తిడి పెరిగింది. అయితే అక్షర్ పటేల్ ( 21 పరుగులు)తో కలిసి జట్టును విజయం దిశగా రాహుల్ నడించాడు. విజయానికి 25 పరుగుల దూరంలో అక్షర్ అవుటైనా కులదీప్ యాదవ్ (10 పరుగులు) తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో రోహిత్ సేన మరో 40 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది.
లంక బ్యాటర్ల విఫలం..
అంతకు తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 39.4 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కెరీర్ లో తొలి వన్డే ఆడిన నువనిదు ఫెర్నాండో ( 50 పరుగులు) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. లంక స్కోర్ 29 పరుగుల వద్ద ఓపెనర్ అవిష్క ఫెర్నాండో( 20 పరుగులు) ను సిరాజ్ పెవిలియన్ కు పంపాడు. ఆ తర్వాత అరంగేట్రం ఆటగాడు నువనిదు ఫెర్నాండో , కుషాల్ మెండీస్ రెండో వికెట్ కు 73 పరుగులు జోడించారు. ఈ సమయంలో శ్రీలంక వికెట్ నష్టానికి 102 పరుగులతో పటిష్టమైన స్థితిలో ఉంది. తొలుత కుషాల్ మెండీస్ ను అవుట్ చేసి కులదీప్ యాదవ్ భారత్ కు బ్రేక్ త్రూ అందించాడు. ఒక్క పరుగు తేడాలో ధనుంజయ డిసిల్వాను ( డకౌట్) అక్షర్ పటేల్ బౌల్డ్ చేశాడు. కాసేపటికే హాఫ్ సెంచరీ చేసి నువనిదు అవుట్ అయ్యాడు. కెప్టెన్ శనక, చరిత అసలంక, హసరంగ డిసిల్వా వెంటవెంటనే అవుట్ కావడంతో శ్రీలంక 152 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కరుణ రత్నే అవుట్ కావడంతో 177 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. కానీ దునిత్ వెల్లలగె ( 32 పరుగులు) కసున రజిత ( 17 పరుగులు నాటౌట్) 9వ వికెట్ కు 38 పరుగులు జోడించి జట్టు స్కోర్ ను 200 దాటించారు. చివరకు శ్రీలంక భారత్ ముందు 216 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
భారత్ బౌలింగ్ భళా..
టీమిండియా బౌలర్లలో మహ్మద్ సిరాజ్, కులదీప్ యాదవ్ చెరో 3 వికెట్లు తీశారు. ఉమ్రాన్ మాలిక్ కు 2 వికెట్లు, అక్షర్ పటేల్ కు ఒక వికెట్ దక్కాయి. చాహల్ స్థానంలో జట్టులోకి వచ్చిన కులదీప్ మంచి ప్రదర్శనతో శ్రీలంక బ్యాటర్లను కట్టడి చేశాడు.