Veera Simha Reddy Review : తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఫ్యాన్ బేస్తో ఉన్న హీరో నందమూరి బాలకృష్ణ, కరోనా టైంలో ప్రేక్షకులకు క్రాక్తో మాస్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబినేషన్లో వచ్చిన సినిమా. వీరసింహా రెడ్డి అనౌన్స్ చేసిన నాటి నుంచి భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు సంక్రాంతి బరిలో ఉండటం, మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యకు పోటీగా నిలవడంతో ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి. అంతటి అంచనాలతో వీరసింహారెడ్డి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల మనసులను గెలిచి సంక్రాంతి పోటీలో నిలిచిందా? లేదా అనేది రివ్యూలో చూద్దాం.
కథ :
ఇస్తాంబుల్లో కారు గ్యారేజ్ చూసుకుంటూ ఉంటాడు జై సింహారెడ్డి (బాలకృష్ణ). అక్కడే తన అమ్మ మీనాక్షి (హానీ రోజ్) కూడా ఉంటుంది. జై ఓ సందర్భంలో ఈష (శ్రుతి హాసన్)తో పరిచయం ఏర్పడుతుంది. అది ప్రేమగా మారుతుంది. వీరి పెళ్లిని ఈష తండ్రి (మురళి శర్మ) ఒప్పుకుంటాడు. దీని గురించి మాట్లాడటానికి తల్లిదండ్రులను తీసుకురావాలని అంటాడు. దీంతో తన తండ్రి వీరసింహారెడ్డి (బాలకృష్ణ) గురించి మీనాక్షి తొలిసారి చెబుతుంది. వీరసింహారెడ్డి రాయలసీమలోని పులిచర్లలో ఉంటాడని చెబుతుంది. మరి మీనాక్షి, వీరసింహారెడ్డి ఎందుకు విడిపోయారు ? వీరసింహారెడ్డికి భానుమతి (వరలక్ష్మీ శరత్ కుమార్)కు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? వీరసింహారెడ్డిని ప్రతాపరెడ్డి (దునియా విజయ్) ఎందుకు చంపాలని చూస్తున్నాడు ? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ :
ఫ్యాక్షన్ బ్యాగ్రౌండ్ తో బాలయ్య ఇప్పటి వరకు చాలా సినిమాలు చేశాడు. ఇది కూడా ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిందే. తాను నందమూరి బాలయ్య ఫ్యాన్ అని, ఒక ఫ్యాన్ బాయ్ గా వీరసింహారెడ్డిని తెరకెక్కిస్తున్నట్టు డైరెక్టర్ గోపిచంద్ మలినేని సినిమా అనౌన్స్ చేసిన సమయంలోనే చెప్పాడు. ఆ మాటను గోపిచంద్ నిలబెట్టుకున్నాడు. బాలయ్యను అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో.. అలాగే ఈ సినిమాలో చూపించాడు గోపిచంద్.
సినిమాలో బాలయ్య ఎంట్రీ వచ్చే ప్రతీ సీన్ లో మాస్ ఎలివేషన్స్ ఇచ్చాడు. దానికి తోడు థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తుంది. సినిమాలో బాలయ్య కత్తి పట్టుకుని శత్రువులను తెగ నరుకుతున్న సమయంలో వచ్చిన సీన్స్ మాస్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. అయితే ఒక సినిమా అంటే.. మాస్ ఎలివేసన్స్, యాక్షన్ సీన్స్ ఉంటే సరిపోదు కదా. వీటితో పాటు ఎమోషన్స్, కామెడీ, కథ, కథనం అన్ని ప్రేక్షకులను థియేటర్ లో కూర్చోబెట్టాలా ఉండాలి.
కానీ, వీరసింహారెడ్డిలో అలా లేదు. డైరెక్టర్ మొత్తం వీరసింహారెడ్డి క్యారెక్టర్ పైనే ఫోకస్ పెట్టాడు. బాలయ్య కత్తి పట్టుకుని విలన్లను తెగ నరికితే.. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు అవుతాయని దర్శకుడు ఫీల్ అయిఉంటాడు. అందుకే సినిమా మొత్తం బాలయ్య కత్తిపైనే ఉంటుంది. ఈ క్రమంలో కథ, కథనాన్ని సినిమాలో కీలకంగా ఉన్న ఎమోషన్ గాలికి వదిలేశాడు.
రాయలసీమ బాగు కోసం అన్న 30 ఏళ్లు కత్తి పట్టుకుంటే.. అన్నను చంపడానికి చెల్లి 30 ఏళ్లు నుంచి ఎదురుచూస్తుంది. ఇది ఒక పాయింట్ కొత్తగా ఉన్నా.. దీన్ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా మల్చడంలో డైరెక్టర్ విఫలమయ్యాడు. అలాగే గజనీ మహ్మద్ లా విలన్ దునియా విజయ్.. వరుసగా హీరోపై దాడి చేస్తాడు. సినిమా ప్రారంభంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ నుంచి.. క్లైమాక్స్ వరకు అన్ని ఫైట్ లలో బాలయ్య, దునియా విజయ్ లే కనిపిస్తారు. ఇది కాస్త ఇబ్బేట్టుగా ఉంటుంది.
అలాగే సినిమా చూస్తున్నంత సేపు.. బోయపాటి శ్రీను సినిమా అనే ఫిల్ వస్తుందే కానీ, ఎక్కడ కూడా క్రాక్ లాంటి హిట్ కొట్టిన గోపిచంద్ మార్క్ కనిపించదు. తన స్టైల్ లో సినిమా చేస్తే.. వేరేలా ఉండేది అని మాత్రం కచ్చితంగా చెప్పొచ్చు.
నటీనటుల విశ్లేషణ :
నటీనటుల విషయానికి వస్తే.. ఆరు పదుల వయసులో కూడా ఎనర్జీటిక్గా ఫైట్స్, డ్యాన్స్ చేయడం బాలయ్యకే సాధ్యం. నటసింహం.. నటనలో ఎక్కడా కూడా తగ్గలేదు. శ్రుతిహాసన్ సినిమా బిగినింగ్లో రెండు మూడు సీన్లు తప్ప సినిమాలో పెద్దగా కనిపించలేదు. రెండు పాటల కోసమే ఆమెను తీసుకున్నట్లు అనిపిస్తుంది. పరిధి మేరకు నటించింది. హానీ రోజ్.. తన పాత్రకు వంద శాతం న్యాయం చేసింది. రాబోయే రోజుల్లో తెలుగు సినిమాల్లో ఈమె మళ్లీ కనిపించవచ్చు. దునియా విజయ్ విలనిజం బాగుంది. వరలక్ష్మీ శరత్ కుమార్ మరోసారి తన యాక్టింగ్తో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. ‘క్రాక్’ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని కుమారుడు ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ పోషించాడు. అది కథను మలుపుతిప్పే పాత్ర అని సినిమాలో చూపించారు. ఆ కుర్రాడు తన పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించాడు.
సాంకేతిక విశ్లేషణ :
సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ గా కావడానికి థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పొచ్చు. అలాగే సాంగ్స్ కూడా సినిమాకు ప్లస్ అయ్యాయి. ఇక దర్శకుడు గోపీచంద్ మలినేని ‘క్రాక్’ సినిమా లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తీసిన సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే బాలయ్యకు గోపీచంద్ అభిమాని కావడంతో ఒక అభిమానిగా ఆయన ఫ్యాన్స్కు ఏం కావాలో అది ఆలోచించాడు తప్ప.. కామన్ ఆడియన్ దృష్టిలో స్టోరీని తీసుకెళ్లలేకపోయాడేమో అనిపిస్తుంది. బాలకృష్ణను అద్భుతమైన యాక్షన్ సీన్స్లో ఎన్నో సినిమాల్లో చూశాం. ‘అఖండ’లో లాగా ఇందులో కూడా మరింత కొత్తగా చూపించడానికి ప్రయత్నించి ఉండాల్సింది.
చివరగా.. ‘వీరసింహారెడ్డి’ బాలయ్య వీరాభిమానుల కోసమే