CS: తెలంగాణ కొత్త ప్రధాన కార్యదర్శి (Chief secretary)గా శాంతికుమారి (Santikumari)ని నియమించింది ప్రభుత్వం. ప్రస్తుతం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న శాంతికుమారిని సీఎస్ గా ఎంపిక చేశారు సీఎం కేసీఆర్. గతంలో నాలుగేళ్లపాటు ‘CMO’లో ప్రిన్సిపల్ సెక్రటరీగా చేసిన అనుభవం ఉంది. కేసీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో మెదక్ కలెక్టర్గా పనిచేశారు. సీఎస్గా శాంతికుమారి 2025 వరకు పదవీలో కొనసాగనున్నారు.
ఎమ్మెస్సీ మెరైన్ బయాలజీ చదివిన శాంతికుమారి.. అమెరికాలో ఎంబీఏ చేశారు. ఐఏఎస్గా విద్య, వైద్య ఆరోగ్య రంగాలు, స్కిల్ డెవలప్ మెంట్, అటవీశాఖల్లో వివిధ హోదాల్లో పని చేశారు. టీఎస్ ఐపాస్లో ఇండస్ట్రీ ఛేజింగ్ సెల్ స్పెషల్ సెక్రటరీగా సేవలందించారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమాల్లో రెండేళ్ల పాటు డిప్యూటేషన్ మీద వెళ్లారు. సుమారు 30 ఏళ్లుగా.. వివిధ రంగాల్లో పని చేసిన విశేష అనుభవం శాంతికుమారి సొంతం.
సోమేశ్కుమార్ను ఏపీకి కేటాయిస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడం.. ఆ వెంటనే ఆయన్ను తెలంగాణ నుంచి రిలీవ్ చేస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇవ్వడంతో సీఎస్ సోమేశ్ బదిలీ తప్పనిసరి అయింది. కొత్త సీఎస్ ఎవరా అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రామకృష్ణారావు, రజత్ కుమార్, అరవింద్ కుమార్ పేర్లు రేసులో ముందున్నాయంటూ ప్రచారం జరిగింది. వారి చుట్టూనే మీడియా కథనాలు రాగా.. ఎవరూ ఊహించని విధంగా శాంతికుమారిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసి షాక్ ఇచ్చారు సీఎం కేసీఆర్.
మరో రెండేళ్ల సర్వీస్ ఉండటం.. వివిధ రంగాల్లో విశేష అనుభవం ఉండటం.. తెలుగు వ్యక్తి కావడం.. అందులోనూ మహిళ అధికారి కావడం.. ఇలా అనేక అంశాలు ఆమెకు అనుకూలంగా మారాయి. తెలంగాణలో బీహార్ అధికారుల పెత్తనం ఎక్కువైందంటూ ప్రతిపక్షాలు పదే పదే విమర్శలు చేస్తుండటంతో ఈసారి తెలుగు వ్యక్తికే ఛాన్స్ ఇవ్వాలని కేసీఆర్ భావించారని అంటున్నారు. మహిళా ప్రాతినిథ్యంపైనా బీఆర్ఎస్ సర్కారు గతంలో బాగా బద్నామ్ కాగా.. ఇప్పుడు ఏకంగా తెలంగాణ తొలి మహిళా సీఎస్ గా శాంతికుమారిని ఎంపిక చేసి అలాంటి విమర్శలకు చెక్ పెట్టారు. సీఎస్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు శాంతికుమారి. ఆమెకు అభినందనలు తెలిపారు కేసీఆర్.