Komatireddy : కాంగ్రెస్ సీనియర్ నేత , భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి పార్టీపై అలక ఇంకా వీడలేదు. మునుగోడు ఉపఎన్నికల ముందు నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత ప్రధాని మోదీని కలిసి వచ్చారు. మూసీ ప్రక్షాళన, విజయవాడ-హైదరాబాద్ హైవే పనులపై మాట్లాడానని బయటకొచ్చి చెప్పారు. అయితే ఆయన తన సోదరుడు బాటలోనే బీజేపీలోకి వెళతారనే ప్రచారం అంతకుముందు నుంచే జరుగుతోంది. మోదీ కలిసిన తర్వాత ఆ అనుమానాలు మరింత బలపడ్డాయి.
మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావ్ ఠాక్రే అధిష్టానం నియమించింది. పార్టీలో విభేదాలను పక్కనపెట్టి సీనియర్ నేతలందరూ కలిసే ఆయనకు స్వాగతం పలుకుతారని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. ఎయిర్పోర్ట్లో టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, మరికొందరు సీనియర్ నేతలు మాణిక్రావ్ ఠాక్రేకు స్వాగతం పలికారు. రేవంత్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న నేతలెవరూ అక్కడ కనిపించలేదు. అదే సమయంలో సీనియర్ వీహెచ్ స్వాగతం పలికేందుకు వెళ్లగా.. ఎయిర్పోర్ట్ సిబ్బంది అడ్డుకున్నారని వార్తలు వచ్చాయి.
మరోవైవు గాంధీ భవన్కు వచ్చిన ఠాక్రే.. ముగ్గురు ఏఐసీసీ సెక్రటరీలతో భేటీ అయ్యారు. గాంధీ భవన్కు రావాలని ఠాక్రే స్వయంగా ఫోన్ చేసి కోమటిరెడ్డి వెంకట్రెడ్డిని ఆహ్వానించారు. తాను అక్కడకు రాని స్పష్టం చేశారట కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి . కావాలంటే బయట కలుస్తానని చెప్పారని తెలుస్తోంది.
కోమటిరెడ్డి వెంకట్రెడ్డి.. చాలాకాలంగా పార్టీ పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో రలిగిపోతున్నారు. ముఖ్యంగా రేవంత్ నాయకత్వాన్ని ఆయన బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. రాష్ట్రానికి కొత్త ఇన్ఛార్జిగా వచ్చిన మాణిక్రావ్ ఠాక్రే ఆయనకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి వ్యవహారం చూస్తుంటే రేవంత్ రెడ్డి నాయకత్వాన్నే కాదు మొత్తం కాంగ్రెస్ అధిష్టానాన్నే వ్యతిరేకిస్తున్నట్లుగా ఉందని ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కోమటిరెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమై ఇలా కాంగ్రెస్ లో అలజడి రాజేస్తున్నారని అనుమాలు కలుగుతున్నాయి. మాణిక్ రావ్ ఠాక్రేను కలవడానికి కోమటిరెడ్డికి ఉన్న ఇబ్బందులేంటి? పార్టీలోని రాష్ట్ర నేతలతో సమస్యలుంటే అధిష్టానం దూతలపై అలకలెందుకు? ..