MODI : ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం
ఈ నెల 19న ప్రధాని హైదరాబాద్ లో పర్యటించాల్సి ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో
వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించాల్సి ఉంది. అలాగే సికింద్రాబాద్ స్టేషన్ లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. అయితే తాజాగా మోదీ పర్యటన వాయిదా పడినట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించింది. ఈ విషయంపై కేంద్రమంత్రి కిషన్రెడ్డికి సమాచారం అందించింది.
ప్రధాని పర్యటన మళ్లీ ఎప్పుడు ఉంటుందనేది త్వరలో ప్రకటిస్తామని పీఎంవో తెలిపింది. ప్రధాని పర్యటన తాత్కాలికంగానే వాయిదా పడిందని పేర్కొంది. కొత్త షెడ్యూల్ను త్వరలోనే తెలియజేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు.
తెలంగాణ పర్యటనలో ప్రధాని మోదీ రూ.7వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయాల్సి ఉంది. ఈ విషయాన్ని గతంలో కిషన్రెడ్డి వెల్లడించారు. సికింద్రాబాద్-మహబూబ్నగర్ మధ్య 85 కి.మీ డబ్లింగ్ రైల్వే లైన్ను మోదీ ప్రారంభించాలి. ఐఐటీ హైదరాబాద్లోని అకడమిక్ భవనాలు, వసతి గృహాలు, ఫ్యాకల్టీ, స్టాఫ్ భవనాలు, టెక్నాలజీ రీసెర్చ్ పార్కు, కన్వెన్షన్ సెంటర్, నాలెడ్జ్ సెంటర్, అతిథిగృహం, లెక్చర్ హాల్ కాంప్లెక్స్, హెల్త్ కేర్ తదితర భవనాలను మోదీ ప్రారంభించాల్సి ఉంది.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ను రూ.699 కోట్ల వ్యయంతో రీడెవలప్మెంట్ చేసేందుకు రైల్వేశాఖ ప్రణాళికలు రూపొందించింది. ఈ పనులకూ ప్రధాని శంకుస్థాపన చేయాల్సి ఉంది. పర్యటన కొత్త షెడ్యూల్ ప్రకటించిన తర్వాత మోదీ ఈ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అయితే ప్రధాని మోదీ పర్యటన ఎందుకు వాయిదా పడిందనే విషయంపై పూర్తి స్పష్టత లేదు. మోదీ బీజీ షెడ్యూల్ వల్లే వాయిదా పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి.