Sri Lanka: శ్రీలంక సంక్షోభం గుర్తుందా? అప్పుల ఊబిలో కూరుకుపోయి, ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోయి.. తినడానికి తిండి కూడా దొరక్క లంక జనం అల్లాడిపోయారు. ఆకాశాన్ని అంటిన ధరలతో… ఏమీ కొనలేక చాలా మంది మంచినీళ్లతో కడుపు నింపుకున్నారు. ఇప్పుడు అదే పరిస్థితి పాకిస్థాన్లోనూ కనిపిస్తోంది. ఓవైపు అప్పులు, రికార్డు స్థాయి ద్రవ్యోల్బణం… మరోవైపు తరిగిపోతున్న విదేశీ మారకద్రవ్య నిల్వలతో పాక్ రోజురోజుకూ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోంది. ఇప్పటికే పాకిస్థాన్లో నిత్యావసరాల ధరలు చుక్కలనంటుతున్నాయి. గోధుమ పిండికి కొరతతో ఏర్పడటంతో పాటు… బియ్యం, పాలు, పెట్రోల్ ధరలు దాదాపు 50 శాతం పెరిగాయి. దాంతో సామాన్య ప్రజలు ఆకలి తీర్చుకునేందుకు నానా బాధలూ పడుతున్నారు.
పాకిస్థాన్లో నిరుడు 36 రూపాయలు ఉన్న కిలో ఉల్లి ధర… 500 శాతానికి పైగా పెరిగి ప్రస్తుతం రూ. 220కి చేరింది. రూ.210 ఉన్న కిలో చికెన్ ధర.. దాదాపు రూ.400 అయింది. పప్పుధాన్యాలు కిలోకు రూ.150 నుంచి రూ.230కి చేరాయి. ఒక కిలో బాస్మతి బియ్యం రూ.150కి, లీటర్ పాలు రూ.150కి చేరాయి. ఇక కిలో గోధుమపిండి బహిరంగ మార్కెట్లో రూ.155కు చేరింది. ప్రభుత్వం సరఫరా చేసి సబ్సిడీ గోధుమపిండి పూర్తిగా అయిపోవడంతో… ప్రభుత్వమే బహిరంగ మార్కెట్లో గోధుమపిండి కొని తక్కువ ధరకు అమ్ముతోంది. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ గోధుమ పిండి కోసం పాక్ జనం గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబడుతున్నారు. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా, సింధ్ ప్రావిన్స్ వంటి అనేక ప్రాంతాల్లో తొక్కిసలాటలు కూడా జరుగుతున్నాయి. ఈ తొక్కిసలాటల్లో నలుగురు చనిపోవడం… అక్కడి దారుణ పరిస్థితులకు అద్దం పడుతోంది.
గత నెలలో పాక్ ద్రవ్యోల్బణం 24.5 శాతానికి చేరుకుంది. ఇది మన దేశం కంటే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ. విదేశీ మారకద్రవ్య నిల్వలు కూడా ఎనిమిదేళ్ల కనిష్టానికి పడిపోయి… 5.5 బిలియన్ డాలర్లకు చేరాయి. ఈ మొత్తం కేవలం మూడు వారాల దిగుమతులకు సరిపోతుంది. ముడిచమురును దిగుమతి చేసుకోడానికి కూడా తగినంత నిల్వలు లేక… ఇంధనాన్ని ఆదా చేయడానికి మార్కెట్లు, ఫంక్షన్ హాళ్లను త్వరగా మూసేయాలని ప్రభుత్వం ఇటీవలే ఆదేశాలు కూడా ఇచ్చింది. ఇప్పుడు పాక్ పరిస్థితి చూస్తుంటే… కచ్చితంగా మరో శ్రీలంక అవుతుందంటున్నారు… నిపుణులు.