Manidweep:అమ్మవారి నివాసం స్థానం మణిద్వీపం. ఈ మణిద్వీపం వర్ణనను శ్రద్ధతో పారాయణం చేస్తే సకల జాతక దోషాలు తొలగిపోతాయి. భూత ప్రేత పిశాచ బాధలుండవు. గృహ ప్రవేశం చేసేటప్పుడు, శంకుస్థాపన చేసేటప్పుడు దీనిని ఇంట్లో పారాయణం చేసుకునే వారు. దాని వల్ల ఇంట్లో వాస్తు దోషాలు పోతాయి. మనుషులలోని అశాంతిని తొలగిస్తుంది. మణిద్వీపం అని తలచినంత మాత్రమే సకల దరిద్రాలూ దరిదాపుకు చేరవని శాస్త్ర ప్రమాణం. మణిద్వీపాన్ని మనసారా చదివినా లేక గానం చేసినా వచ్చేఫలితాలను వర్ణించడానికి వేయి పడగల ఆదిశేషుడుకి కూడా సాధ్యం కాదని పురాణాలు చెబుతున్నాయి..
ఈ బ్రహ్మాండంను కనురెప్పపాటులో సృష్టించి లయముచేయగల 32 మహాశక్తుల పరిరక్షణలో ఈ సమస్థ విశ్వం ఉండుటవలన ముప్పదిరెండురకాల పూలతో, పసుపు, కుంకుమలతో..నవరత్నాలతో..రాగి కంచు వెండి బంగారము మెదలగు లోహాలతో యధశక్తి అమ్మకు పూజ చేసుకోవచ్చు. నైవేధ్యాలుగా 32 రకాలు చేసి, సుగంధ ద్రవ్యాలతో మణిద్వీప నివాసినిని పూజిస్తారు.మొగలి పూవు,బంతి పూవూ పూజకు పనికిరాదు . ఏ పూజ చేసినా భక్తి ప్రధానం.
శ్రీ మహాత్రిపురసుందరి శ్రీ లలితా జగన్మాత అమ్మవారు నివాసముండే పవిత్ర ప్రదేశమే మణి ద్వీపం. 14 లోకాల అనంతరం సర్వలోకంలో ఆమె కొలువై ఉన్నారు. యావత్ జగతిని పరిరక్షించే అమ్మవారి మదిలో ఏర్పడిన ఆలోచనలకు అనుగుణంగా ఈ లోకం ఉద్భవించింది. నాలుగువైపులా అమృతంతో కూడిన సముద్రం సరిహద్దులుగా వున్న ఈ ద్వీపాన్ని వర్ణించాలంటే మన శక్తి చాలదు. దేవీ భాగవతంలో మణి ద్వీపం గురించిన వర్ణన వుంది. అంతులేని వజ్రాలు, రత్నాలు, ముత్యాలు లాంటి నవనిధులతో పాటు బంగారు మయమైన కొండలు ఈ ద్వీపంలో ఉన్నాయట
మొదట ఇనుప ప్రాకారంలో భూమండలంలోని రారాజులు వుంటారు.వీరు అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను పంపుతుంటారు. అనంతరం కంచుతో చేసిన రెండో ప్రాకారం వుంటుంది. పచ్చటి అరణ్యములతో, జంతువులు, పక్షుల కిలకిలరావాలతో ఆ ప్రాంతం ప్రతిధ్వనిస్తుంటుంది. ఇలా అనేక ప్రాకారాలు దాటిన అనంతరం చింతామణి గృహంలో అమ్మవారు వుంటారు. జ్ఞాన మండపంలో భక్తులకు దర్శనమిస్తారు. ముక్తి మండపంలో మంత్రులతో చర్చలు నిర్వహిస్తారు. వైకుంఠం, కైలాసం కంటే అద్భుతమైన ప్రపంచం అమ్మవారి నివాసం.