CS: అదును చూసి సోమేశ్ కుమార్ పై వేటు వేసింది కేంద్రం. క్యాట్ తీర్పును రద్దు చేస్తూ.. సోమేశ్ కుమార్ ను ఏపీకి కేటాయిస్తూ.. తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే కేంద్రం రంగంలోకి దిగింది. వెంటనే సోమేశ్ కుమార్ ను తెలంగాణ నుంచి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. గురువారంలోగా ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే సీఎస్ సోమేశ్ కుమార్ ప్రగతి భవన్ వెళ్లి సీఎం కేసీఆర్ ను కలిశారు. హైకోర్టు ఆదేశాలపై చర్చించారు. ఈలోగా కేంద్రం నుంచి ఉత్తర్వులు రావడంతో.. ఇక సోమేశ్ బదిలీ తప్పేలా లేదు.
అయితే, సోమేశ్ కుమార్ కు మరో ఏడాది మాత్రమే సర్వీస్ ఉంది. ఈ ఏడాది డిసెంబర్ లో ఆయన రిటైర్ కావాల్సి ఉంది. ఇప్పుడు ఏపీకి వెళ్లడం.. అక్కడ ప్రాధాన్య పోస్టు రాకుంటే.. అవమానంగా భావించడం ఎందుకని.. వీఆర్ఎస్ తీసుకునే దిశగా సోమేశ్ ఆలోచిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు కేసీఆర్ తో కూడా చర్చించినట్టు సమాచారం. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాక సోమేశ్ కుమార్ ను సీఎం కేసీఆర్ ప్రభుత్వ సలహాదారుగా నియమించడం ఖాయంగా కనిపిస్తోంది.
మరోవైపు, తెలంగాణ సీఎస్ రేసులో ముగ్గురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణారావును కొత్త చీఫ్ సెక్రటరీగా నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనతో పాటు మరో ఇద్దరి పేర్లు కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్ తో పాటు ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న రజత్ కుమార్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
అయితే, బీహారీ బ్యాచ్ కే సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారంటూ ప్రతిపక్షాలు పదే పదే విమర్శలు చేస్తున్నందున.. ఈసారి తెలుగువారైన రామకృష్ణారావుకే సీఎస్ గా ఎంపిక చేస్తారని అంటున్నారు.
అటు, సోమేశ్ కుమార్ బదిలీతో తెలంగాణలో పని చేస్తున్న ఏపీ కేడర్ ఐఏఎస్, ఐపీఎస్ లలో టెన్షన్ మొదలైంది. ఏపీ కేడర్ అధికారులైన అంజనీకుమార్, వాకాటి కరుణ, రొనాల్డ్ రాస్, ప్రశాంతి, అభిషేక్ మహంతి, వాణిప్రసాద్ తదితరుల పోస్టింగులపై ఉత్కంఠ నెలకొంది.