Bandi Sanjay: సోమేశ్కుమార్కు ఒక న్యాయం.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు మరో న్యాయమా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణ సీఎస్గా సోమేశ్ కుమార్ కొనసాగింపును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చినందున తక్షణమే సీఎస్గా ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పును పాటిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం సోమేశ్ కుమార్ను సీఎస్ పదవి నుంచి తప్పించి.. తక్షణమే ఆయన్ను ఏపీకి బదిలీ చేయాలన్నారు బండి సంజయ్.
తెలంగాణ కేడర్ కు చెందిన ఎందరో అధికారులు సీనియారిటీ లిస్టులో ఉండగా.. ఏపీకి కేటాయించిన సోమేశ్కుమార్ను సీఎస్గా నియమించి.. సీఎం కేసీఆర్ అనుచిత లబ్ధి పొందారని బండి సంజయ్ విమర్శించారు. 317 జీవో సహా అనేక ఉద్యోగ, ప్రజా వ్యతిరేక ఉత్తర్వులను సీఎస్ సోమేశ్ కుమార్ ద్వారా విడుదల చేయించారని ఆరోపించారు.
HMDA, రెవెన్యూ, ఇరిగేషన్, హోం తదితర శాఖల్లో తమకు అనుకూలమైన అధికారులను నియమించుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడేందుకు సోమేశ్ కుమార్ ను సీఎం కేసీఆర్ పావుగా వాడుకున్నారని విమర్శించారు. సోమేశ్ కుమార్ నియామకం విషయంలో కోర్టులో కేసులు పెండింగ్ లో ఉండగా సీఎస్గా నియమించడం కేసీఆర్ అనైతిక రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు.
2014 రాష్ట్ర విభజన తర్వాత DPOT ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కి ఏపీకి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు తెలంగాణలో కీలక బాధ్యతలు ఇవ్వడం అనైతికం, అప్రజాస్వామికమన్నారు. సీఎం కేసీఆర్ ఏనాడూ చట్టాలను, రాజ్యాంగాన్ని, కేంద్ర నిబంధనలను గౌరవించలేదన్నారు. తన రాజకీయ అవసరాల కోసం అధికారులను పావుగా వాడుకుంటూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని బండి సంజయ్ తప్పుబట్టారు. ఇప్పటికైనా హైకోర్టు ఆదేశాల ప్రకారం సోమేశ్ కుమార్ ను తొలగించి, తెలంగాణకు కేటాయించిన వ్యక్తిని సీఎస్ గా నియమించాలని డిమాండ్ చేశారు.