Somesh Kumar : తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ క్యాడర్ కేటాయింపు వివాదంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు నిచ్చింది. గతంలో కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) ఇచ్చిన ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. సోమేష్ కుమార్ ఏపీకి క్యాడర్ కు వెళ్లాలని హైకోర్టు ఆదేశించింది.
ఇదీ వివాదం..
రాష్ట్ర విభజన సమయంలో సోమేశ్ కుమార్ను కేంద్రం ఏపీకి కేటాయించింది. తనను ఏపీకి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ను సోమేశ్ కుమార్ ఆశ్రయించారు. అక్కడ సోమేష్ కుమార్ కు అనుకూలంగా తీర్పు వచ్చింది. కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను క్యాట్ నిలిపివేసింది. తెలంగాణ క్యాడర్ లో సోమేష్ కుమార్ కొనసాగేలా క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది. క్యాట్ మధ్యంతర ఉత్తర్వులతో అప్పటి నుంచి తెలంగాణ క్యాడర్ లో సోమేశ్ కుమార్ కొనసాగుతున్నారు.
క్యాట్ ఉత్తర్వులను కొట్టివేయాలని 2017లోనే కేంద్రం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై తాజాగా హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ధర్మాసనం విచారణ చేపట్టి క్యాట్ ఉత్తర్వులను కొట్టివేసింది. సోమేశ్ కుమార్ సేవలు అవసరం అని తెలంగాణ సర్కార్ భావిస్తే ఏపీ ప్రభుత్వ అనుమతి తీసుకుని డిప్యూటేషన్పై కొనసాగించుకోవాలని సూచించింది. అయితే తీర్పు అమలును 3 వారాలు నిలిపివేయాలని సోమేశ్ కుమార్ తరపు న్యాయవాది కోర్టును విజ్ఞప్తి చేశారు. ఇందుకు న్యాయస్థానం అంగీకరించింది. దీంతో సోమేష్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తిగా మారింది. హైకోర్టు తీర్పు ప్రకారం ఆయన ఏపీ కేడర్కు వెళ్తారా లేక తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారో చూడాలి. మరో మూడు వారాల తర్వాత ఈ విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సోమేష్ కుమార్ 2019 నుంచి తెలంగాణ సీఎస్ గా కొనసాగుతున్నారు.