Vasantha Krishnaprasad : మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేస్తూ సొంత పార్టీలో హీట్ పెంచుతున్నారు. గుంటూరు జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఉయ్యూరు శ్రీనివాస్ కు మద్దతుగా మాట్లాడారు. NRI లను వేధిస్తే సేవా కార్యక్రమాలు ఎలా జరుగుతాయని నేరుగా ప్రభుత్వాన్నే ప్రశ్నించారు. మాజీ మంత్రి పేర్ని నాని NRIలపై చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ వసంత కృష్ణప్రసాద్ మాట్లాడటంతో వైసీపీలో అలజడి రేగింది. ఆయన ఇప్పుడు మరోసారి రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
పది మంది రౌడీలను వెంటేసుకుని తిరగడం చేతగాక తాను పాతతరం నాయకుడిగా మిగిలిపోయానని వసంత కృష్ణప్రసాద్ అన్నారు. మైలవరం మండలం చంద్రాల సొసైటీ భవన శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే.. పార్టీలో పరిణామాలపై అసంతృప్తిని వెళ్లగక్కారు. తాను పుట్టినప్పటి నుంచి తన తండ్రి రాజకీయాల్లోనే ఉన్నారని తెలిపారు. 55 ఏళ్లుగా తమ కుటుంబం రాజకీయాల్లో ఉందన్నారు. అయితే రౌడీలను వెంటేసుకుని తిరిగేవారే ముందడుగు వేసేలా ప్రస్తుత రాజకీయాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యేను ఎందుకయ్యానా? అని బాధపడుతున్నానని వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. సామాన్య ప్రజలకు కొన్నిసార్లు సాయం చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడున్నరేళ్లలో తాను ఎవరిపైనా అక్రమ కేసులు పెట్టించలేదని స్పష్టం చేశారు. ఎవరికీ పథకాలు ఆపలేదన్నారు. కేసుల విషయంలో కొంతమంది వైసీపీ నాయకులకు తనపై అసంతృప్తి ఉండొచ్చని తెలిపారు.
ఇటీవల మైలవరం నియోజకవర్గంలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వసంత నిలిపివేశారు. అప్పటి నుంచి సందర్భం వచ్చిన ప్రతిసారి ప్రభుత్వంపై, పార్టీపై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తున్నారు. నియోజకవర్గ సమీక్షలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్ ..ఆ సమావేశంలోనే ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటిస్తున్నారు. కానీ కొద్దిరోజుల క్రితం మైలవరం నియోజకవర్గ సమీక్ష చేసిన సీఎం జగన్.. టిక్కెట్ పై వసంత కృష్ణప్రసాద్ కు స్పష్టత ఇవ్వలేదు. ఈ నియోజకవర్గంపై మంత్రి జోగి రమేష్ కన్నేశారు. మరి జగన్ మనసులో ఏముందో తెలీదుకానీ.. వసంత కృష్ణప్రసాద్ మాత్రం తనకు టిక్కెట్ దక్కదనే నిర్ణయానికి వచ్చేశారు. ఈ నేపథ్యంలోనే పదేపదే సొంతపార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మరి వైసీపీ అధిష్టానం వసంత కృష్ణప్రసాద్ వ్యవహారాన్ని ఎలా డీల్ చేస్తుందో చూడాలి మరి.