India-Srilanka : హార్దిక్ పాండ్య సారథ్యంలోని భారత్ జట్టు శ్రీలంకపై టీ20 సిరీస్ను సొంతం చేసుకుంది. ఇప్పుడు రోహిత్ శర్మ నాయకత్వంలో వన్డే సిరీస్ కు సిద్ధమైంది. గౌహతి వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. భారత తుది జట్టు ఎంపిక ఆసక్తి రేకెత్తిస్తోంది. సీనియర్లు కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, మహ్మద్ షమి లంకతో వన్డే సిరీస్లో ఆడబోతున్నారు. ఈ సిరీస్కు మరో సీనియర్ ఆటగాడు బుమ్రా ఎంపికైనా పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో విశ్రాంతి ఇచ్చారు.
డబుల్ సెంచరీ వీరుడికి చోటు లేదా?
చివరిగా బంగ్లాదేశ్ పై వన్డే సిరీస్ ను కోల్పోయింది భారత్. అయితే ఈ సిరీస్ మూడో వన్డేలో ఓపెనర్ ఇషాన్ కిషన్ అద్భతంగా రాణించాడు. డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. కానీ శ్రీలంకతో జరిగే తొలి వన్డే మ్యాచ్ లో అతడికి జట్టులో చోటు దక్కే అవకాశం లేదని కెప్టెన్ రోహిత్ మాటలు స్పష్టం చేస్తున్నాయి. శ్రీలంకతో తొలి వన్డేలో తనతోపాటు శుభ్మన్ గిల్ ఓపెనర్గా బరిలోకి దిగుతాడని రోహిత్ ప్రకటించడంపై క్రికెట్ అభిమానులు షాక్ కు గురవుతున్నారు. దీంతో ఇషాన్ కు తుది జట్టులో స్థానం అనుమానంగా ఉంది. అతడిని ఆడించాలంటే కేఎల్ రాహుల్ను పక్కన పెట్టాలి. బంగ్లాదేశ్ పై తొలి టెస్టు లో ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన కులదీప్ ను రెండో టెస్టుకు పక్కన పెట్టడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మరి ఇప్పుడు శ్రీలంకతో తొలి వన్డేలో ఇషాన్ కిషన్ ను పక్కన పెట్టే సాహసం టీమిండియా చేస్తుందా? చూడాలి.
జట్టు కూర్పు ఇలా
రోహిత్, శుభ్ మన్ గిల్ ఓపెనర్లగా వస్తారు. కోహ్లి మూడో స్థానంలో దిగుతాడు. నాలుగో స్థానానికి సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్ల మధ్య పోటీ ఉంది. సూర్య టీ20ల్లో భీకర ఫామ్లో ఉండగా.. శ్రేయస్ వన్డేల్లో నిలకడగా ఆడుతున్నాడు. మరి ఇద్దరిలో ఎవరికి తుది జట్టులో చోటు దక్కుతుందో చూడాలి. ఆల్ రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్కు చోటు దక్కుతుంది. టీ20 సిరీస్లో ప్రభావం చూపించలేకపోయిన చాహల్ కు కుల్దీప్ యాదవ్ పోటీగా మారాడు. ఇక పేస్ బౌలింగ్ విభాగంలో షమి, సిరాజ్ కు స్థానం దక్కుతుంది. మూడో పేసర్ స్థానం అర్ష్దీప్, ఉమ్రాన్ మాలిక్ ల్లో ఒక్కరికి దక్కుతుంది.
టీ20 సిరీస్ ఓడినప్పటికీ.. లంక ప్రదర్శన ఆకట్టుకుంది. తొలి మ్యాచ్ త్రుటిలో విజయాన్ని చేజార్చుకుంది. రెండో మ్యాచ్ లో భారీ స్కోర్ సాధించి గెలిచింది. మూడో మ్యాచ్ లో మాత్రమే ఆ జట్టు విఫలమైంది. మొత్తంగా ఆ జట్టు ఆట మెరుగ్గానే ఉంది. బ్యాటింగ్లో కుశాల్ మెండిస్, శనక, అసలంక, బౌలింగ్లో రజిత, తీక్షణ, హసరంగ, చమిక కరుణరత్నె మెరుగ్గా రాణిస్తున్నారు. ఆల్రౌండర్ ధనంజయ డిసిల్వాల లంక జట్టుకు అదనపు బలం.
తుది జట్లు అంచనా
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, కోహ్లి, రాహుల్, సూర్యకుమార్/శ్రేయస్, హార్దిక్, అక్షర్, చాహల్/కుల్దీప్, సిరాజ్, షమి, అర్ష్దీప్/ ఉమ్రాన్ మాలిక్
శ్రీలంక: కుశాల్ మెండిస్, నిశాంక, ఆవిష్క ఫెర్నాండో, ధనంజయ డిసిల్వా, అసలంక, శానక (కెప్టెన్), హసరంగ, చమిక కరుణరత్నె, తీక్షణ, రజిత, మదుశంక/ లహిరు కుమార
గౌహతి పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. మధ్యాహ్నం ఒటిన్నరకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. 2018లో ఇక్కడ జరిగిన వన్డే మ్యాచ్లో వెస్టిండీస్ 323 పరుగుల లక్ష్యాన్ని నిర్దేసిస్తే భారత్ 43వ ఓవర్లోనే కేవలం రెండే వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆ మ్యాచ్లో రోహిత్ (152 నాటౌట్), కోహ్లి (140) సెంచరీలు చేశారు. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశాలున్నాయి.