BJP: ఈమధ్య ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను మార్చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. సంజయ్ స్థానంలో ఈటల రాజేందర్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తారని చెబుతున్నారు. బండిని ఎందుకు మారుస్తున్నారో.. ఎప్పుడు ఈటలకు బాధ్యతలు అప్పగిస్తారో.. అంత ఎవరికి తోచినట్టు వారు రాసేస్తున్నారు. అవి చదివి పార్టీ శ్రేణులు సైతం డైలమాలో పడిపోతున్నారు. అయితే, అలాంటిదేమీ లేదంటూ.. బండి సంజయ్ ను మార్చేది లేదంటూ.. ప్రస్తుత టీంతోనే ఎన్నికలకు వెళ్తామంటూ.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేసినా.. ఇంకా ఆ ప్రచారం మాత్రం ఆగట్లేదు. లేటెస్ట్ గా బీజేపీ సీనియర్ నేత విజయశాంతి సైతం ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. అరకొర సమాచారాన్ని నమ్మి.. చిలవలు పలవలు చేసి ప్రచారం చేసేవారికి ఇంతకు మించి చెప్పాల్సిందేమీ లేదంటూ.. రేపటి విజయం బీజేపీది, ఫలితం తెలంగాణ ప్రజలందరిదీ.. అంటూ చెప్పుకొచ్చారు. ఇంతకీ ఇదంతా బీజేపీలోనే జరుగుతోందా? లేదంటే, బీజేపీ టార్గెట్ గా జరుగుతోందా?
బండి సంజయ్ జోరు మీదున్నారు. ఆయన నాయకత్వంలో పార్టీ దూసుకుపోతోంది. మునుపెన్నడూ లేనంత ఉత్సాహం కనబడుతోంది. అలాంటిది ఉన్నట్టుండి బండి సంజయ్ ను ఎందుకు మారుస్తారు? ఈటల రాజేందర్ కు ఎందుకు కిరీటం కట్టబెడతారు? ఇప్పటికే ఈటల రాజేందర్ కు పార్టీలో అధిక ప్రాధాన్యమే ఇస్తున్నారు. చేరికల కమిటీ బాధ్యతలు సైతం ఆయనకే అప్పగించారు. పార్టీ పెద్దలకూ ఆయనపై గురి ఉంది. కేసీఆర్ కు ధీటైన వ్యక్తినే భావన ఉంది. అంతమాత్రాన.. నిన్నగాక మొన్న వచ్చిన ఈటలను అంత అర్జెంటుగా పార్టీ ప్రెసిడెంట్ ను చేయాల్సిన అత్యవసర పరిస్థితి అయితే కనిపించడం లేదు. బండి సంజయ్ జోష్ కు హైకమాండ్ బ్రేకులు వేయాలని ఎందుకు అనుకుంటుంది? ఇలాంటి లాజిక్ తో సంబంధం లేకుండా.. ఎవరో ఏదో అనేయడం.. దాన్ని తెగ వైరల్ చేసేయడం.. ఈ మధ్య ట్రెండ్ గా మారిందంటున్నారు.
ఇక బండి దూకుడు చూసి ఈర్ష పడుతున్న కొందరు పార్టీ పెద్దలే ఇలాంటి వార్తలను లీక్ చేస్తున్నారనే వాదనా వినిపిస్తోంది. క్రమశిక్షణకు మారుపేరైన తెలంగాణ బీజేపీలోనూ ఇటీవల ఆధిపత్య పోరు నడుస్తోందని చెబుతున్నారు. బండి సంజయ్ కు వ్యతిరేకంగా పలుమార్లు కొందరు లీడర్లు ప్రత్యేక సమావేశాలు పెట్టడం.. ఆ విషయం తెలిసి అధిష్టానం వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ కోల్డ్ వార్ ఇంకా నడుస్తోందని.. అదలా కంటిన్యూ అవుతూ బండి సంజయ్ ను మార్చేస్తున్నారనే ప్రచారం కావాలనే తీసుకొచ్చారని కూడా అనుమానిస్తున్నారు. బండికి, ఈటలకు మధ్య చిచ్చు పెట్టేందుకు మొదటినుంచీ ఓ వర్గం ప్రయత్నిస్తోందనే టాక్ కూడా ఉంది. అందులో భాగమే ఇదంతా అంటున్నారు కొందరు. మరోవైపు, బీజేపీ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు బీఆరెస్సో, కాంగ్రెస్సో ఆడుతున్న మైండ్ గేమ్ కూడా కావొచ్చని చెబుతున్నారు.
అసలు, బండిని మార్చేస్తారనే న్యూస్ ఎక్కడ పుట్టిందో స్పష్టంగా తెలియదు. మొదట ఓ న్యూస్ పేపర్ లో కనిపించిందని అంటున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అది అలా అలా వైరల్ అయింది. మరి, ఆ న్యూస్.. వ్యూస్ కోసం రాసిందా? వారికి ఇంటర్నల్ సమాచారం ఉందా? లేదంటే, ఎవరైనా వారితో అలా రాయించారా? ఏమో.
సోషల్ మీడియాలో ఇలాంటి కోడిగుడ్డు మీద ఈకలు పీకే వార్తలు తరుచూ వస్తుంటాయి. అవి క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. అది చూసి మరింత రెచ్చిపోతూ.. మరిన్ని గాసిప్స్ రాసేస్తున్నారు. ఆ తర్వాత ఆ వార్తలకు సంజాయిషీ ఇచ్చుకోలేక.. పార్టీలు, నేతలు తెగ ఇబ్బందిపడుతున్నారు. ఇదంతా అదో రకం వెర్రిమాలోకం. ప్రస్తుతం జరుగుతున్న బండి సంజయ్ మార్పు ప్రచారం సైతం అదేటైపు అంటున్నారు. కిషన్ రెడ్డి చెప్పినట్టు బండి సంజయ్ ను మార్చేదేలే..అని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.