GOLD: పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలు. చదవగానే కచ్చితంగా షాక్ అయ్యుంటారు. 10 గ్రాము బంగారం ధర లక్ష రూపాయలు దాటడమే ఆలస్యం.. ఈజీగా లక్షన్నర వరకు వెళ్తుందనేది నిపుణుల అంచనా. ఇప్పటికిప్పుడు కాదు గాని ఫ్యూచర్లో మనం చూడబోయే గోల్డ్ రేట్ ఇదే.
ఎప్పుడో మాట ఇప్పుడు అనవసరం. కావాల్సిందల్లా.. ఈ ఏడాది ధర ఎంత పెరుగుతుందన్నదే. ఈ ఏడాది 10 గ్రాముల పసిడి రూ.62వేలకు వెళ్లడం దాదాపు కన్ఫామ్. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ లెక్క తప్పదంటున్నారు అనలిస్టులు.
బంగారం ధర మళ్లీ పరుగులు పెడుతోంది. ఈ సమయంలో గోల్డ్ కొనడం కరెక్టేనా? అసలు ఎప్పుడు కొనాలి? ఎప్పటి వరకు వెయిట్ చేయాలి? మనలో చాలా మందికి బంగారం కొనడానికి సరైన సమయం ఎప్పుడో తెలీదు. బంగారం ధరకు, భయానికి ఒక లింక్ ఉంది. అది తెలిస్తే ఎప్పుడు కొనాలో, ఎప్పటి వరకు ఆగాలో తెలుస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా భయాలు నెలకొన్నప్పుడు బంగారం ధర పెరుగుతుంది. ఓ ఉదాహరణ చెబితే ఈజీగా అర్ధం చేసుకుంటారు. ప్రపంచం మొత్తం గడప దాటని సందర్భం ఏది? కరోనా వచ్చినప్పుడే కదా..! ఆ కరోనా సమయంలోనే బంగారం ధర ఆల్టైం హైకి చేరింది. 2020 ఆగస్ట్లో పది గ్రాముల పసిడి 56,200 రూపాయలను టచ్ చేసింది. కారణం… భయం.
1973 నుంచి ఇప్పటి వరకు అమెరికాలో ఏడు సార్లు మాంద్యం వచ్చింది. ఇలా వచ్చిన ప్రతిసారి గోల్డ్ రేట్ పెరుగుతూ పోయింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రీసెర్చ్ ప్రకారం ఈ ఏడాది బంగారం ధర భారీగా పెరుగుతుంది. కారణం ఏంటో తెలుసా.. భయమే. అమెరికా, యూరప్ దేశాలను మాంద్యం తాకేసినట్టే. ఇప్పటికే చైనాలో కరోనా విజృంభిస్తోంది. స్టాక్ మార్కెట్లు లాభాలు ఇవ్వడం లేదు. ప్రపంచ దేశాల్లో పారిశ్రామిక అభివృద్ధి దారుణంగా పడిపోతోంది. అమెరికా సహా అనేక దేశాల్లో ఉద్యోగాలు వేలకు వేలు ఊడిపోతున్నాయి. అంతర్జాతీయ పరిస్థితుల ఎఫెక్ట్.. ఆల్రడీ మన దగ్గర కనిపిస్తూనే ఉంది. అందుకే.. గోల్డ్ రేట్ మళ్లీ 56వేలు టచ్ చేసింది. ఈ పరుగు 62వేలు చేరే వరకు ఆగదనేది బులియన్ మార్కెట్ అంచనా.
సరే.. గోల్డ్ రేట్ ఎప్పుడు తగ్గుతుందో తెలుసా..? ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు. దీనికీ ఎగ్జాంపుల్ కావాలా. 2020 జనవరి 16న ఒక్క రోజులోనే బంగారం ధర 2వేలు పడిపోయింది. కారణం.. సరిగ్గా అదే రోజు.. కరోనాకు వ్యాక్సిన్ వచ్చేసింది అన్న వార్త రావడమే. అంటే.. శుభవార్త విన్నప్పుడు తగ్గుతుంది, భయాలు రేగినప్పుడు పెరుగుతుంది..? అంటే, మాంద్యం పోయి, చైనాలో కరోనా తగ్గి, రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొలిక్కి వచ్చి, అమెరికా ఫెడ్ వడ్డీరేట్లు తగ్గిస్తే తప్ప బంగారం దిగి రాదు.
భవిష్యత్తులో బంగారం దొరకని పరిస్థితి ఉంటేనే ధర లక్ష రూపాయలకు చేరుతుందనేది కొందరి వాదన. నిల్వలు ఉన్నంత కాలం బంగారం వెలికితీస్తూనే ఉంటారు. మరి రేప్పొద్దున బంగారం నిల్వలు అయిపోతే..? ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల టన్నుల బంగారాన్ని తవ్వి తీశారు. ప్రపంచవ్యాప్తంగా ఇంకా 50వేల టన్నుల బంగారం మాత్రమే ఉంది. అది కాస్తా అయిపోతే..?
బంగారం భూమిపైనే కాదు.. సముద్రగర్భంలోనూ మనం ఊహించలేనంత బంగారం ఉంది. అంటార్కికా మంచు కింద కూడా ఉంది. చందమామ, ఇతర గ్రహాల్లోనూ బోలెడంత బంగారం ఉంది. కాని, వీటిని వెలికితీయడం చాలా చాలా కష్టం.. ఒక్కోసారి అసాధ్యం కూడా. అందుకే, భూమ్మీద బంగారం తవ్వి తీయడం అయిపోతే.. అప్పుడిక గోల్డ్ రీసైకిల్ చేయడం మొదలుపెడతారు. గోల్డ్ మైనింగ్ నిలిచిపోతే జరిగేది అదే. మనం వాడుతున్న బంగారాన్ని రీసైకిల్ చేయడం ఒక్కటే మార్గం.
రిజర్వ్ బ్యాంకుల్లో ఉన్న బంగారం బయటకు తీయడం మారో మార్గం. ఈ లెక్కన అమెరికాను మించిన వాళ్లు లేరు. ప్రస్తుతం అమెరికా దగ్గర 8వేల 133 మెట్రిక్ టన్నుల బంగారం ఉంది. ఇండియాలో ఆర్బీఐ దగ్గర ఉన్నది కేవలం 785 మెట్రికల్ టన్నులే. అలాగని ఇండియాలో ఉన్న గోల్డ్ను తక్కువ అంచనా వేయొద్దు.
మన ఆడవాళ్ల దగ్గర బంగారం ఎంత ఉంటుందో తెలుసా. రఫ్గా కాలిక్యులేట్ చేసినా సరే.. ప్రపంచంలో ఉన్న మొత్తం బంగారంలో 11 శాతం మనింటి ఆడవాళ్ల దగ్గరే ఉంది. అమెరికా, స్విట్జర్లాండ్, జర్మనీ, ఐఎంఎఫ్ దగ్గర ఉన్న బంగారం అంతా ఒక దగ్గర పోగేసినా సరే..ఇండియన్ హౌస్ వైఫ్స్ దగ్గర ఉన్న బంగారం ముందు జుజూబీ. కాకపోతే, మన ఇళ్లల్లో ఉన్న బంగారాన్ని బయటకు తీయాలంటే.. ప్రభుత్వాలు అద్భుత పథకాలు ప్రకటించాల్సి ఉంటుంది.
సో, ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం జోలికి వెళ్లకపోవడమే మంచిది. పెళ్లిళ్లు, ఇతర అవసరాలు ఉంటే నిరభ్యంతరంగా కొనుక్కోవచ్చు. మాంద్యం ముగిసి, మళ్లీ ఉద్యోగాలు పుట్టుకొచ్చి, పారిశ్రామిక ఉత్పత్తి పుంజుకున్నప్పుడు.. స్టాక్ మార్కెట్లు ఆటోమెటిక్గా పెరుగుతాయి. అలాంటప్పుడు బంగారం ధర కచ్చితంగా తగ్గుతుంది. సో.. అప్పటి వరకు వెయిట్ చేయడమే కరెక్ట్.