Revanth Reddy: బీఆర్ఎస్ అంటే భస్మాసుర సమితి అంటూ ఎద్దేవా చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సర్పంచుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసి వారిని ఆత్మహత్యలకు ఉసిగొల్పుతోందని అన్నారు. సర్పంచులకు రావాల్సిన 35 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందని ఆరోపించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ఉన్న బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో ఇందిరాపార్క్ ధర్నాచౌక్ దగ్గర ‘నిధులు, విధులపై సర్పంచ్ల శంఖారావం’ పేరుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి.
పంచాయతీల అభివృద్ధి కోసం ఆస్తులు అమ్మి, అప్పులు చేసి సర్పంచ్లు పనులు చేశారన్నారు. సకాలంలో బిల్లులు చెల్లించక.. కొందరు సర్పంచ్లు, ఉపసర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భిక్షాటన చేసి పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు ఇవ్వాల్సిన పరిస్థితులు వచ్చాయని మండిపడ్డారు. ఈ ఏడాది కేవలం జీతాల కోసమే ఇప్పటి వరకు 28 వేల కోట్లు అప్పుతెచ్చిన కేసీఆర్.. ఇంకా 3 నెలల పాటు ఉద్యోగులకు జీతాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.
తెలంగాణలో ఉద్యోగులకు నెల ఫస్ట్కు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ 5 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని ఆరోపించారు. తెలంగాణలో పుట్టబోయే బిడ్డపై కూడా లక్ష 50 వేల అప్పును మోపిన కేసీఆర్ ను ఏం చేయాలని అన్నారు.
రాష్ట్రాన్ని ఇంత అధ్వానంగా మార్చేసిన తండ్రి కొడుకుల్ని ట్యాంక్ బండ్ దగ్గరి అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఉరి వేసినా తప్పులేదంటూ మండిపడ్డారు రేవంత్ రెడ్డి.
హరితహారం మొక్క చనిపోతే సర్పంచ్ లను సస్పెండ్ చేస్తామన్న ముఖ్యమంత్రి.. కేటీఆర్ నిర్లక్ష్యం వల్ల హైదరాబాద్ వరదల్లో 30 మంది కొట్టుకుపోయి చనిపోయారని మరి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ పై చర్యలు తీసుకోరా అని ప్రశ్నించారు.
తెలంగాణ మోడల్ అంటూ గొంతు చించుకుంటున్న కేసీఆర్.. రాష్ట్రానికి చేసిందేమిటని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ మోడల్ అంటే మినిమమ్ గవర్నెన్స్.. మ్యాక్సిమమ్ పాలిటిక్స్గా మారిపోయిందని రేవంత్ ఎద్దేవా చేశారు.