Sunil kanugolu: ఎట్టకేలకు పోలీస్ విచారణకు హాజరయ్యారు సునీల్ కనుగోలు. ఆయన్ను రెండు గంటల పాటు విచారించారు పోలీసులు. ఇటీవల రోజంతా ప్రశ్నించడం కామన్ గా మారగా.. సునీల్ ను మాత్రం కేవలం 2 గంటలే ప్రశ్నించడం ఆసక్తికరం. అంటే, ఆ కేసులో పెద్దగా పస లేదనా? బలమైన కేసు కాకపోవడం వల్లే.. ఏదో కొన్ని విషయాలు ప్రశ్నించి వదిలేశారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ వాదులు. ఇది కావాలనే పార్టీని ఇబ్బంది పెట్టేందుకే పెట్టిన కేసు అని తేలిపోతోందని అంటున్నారు.
సునీల్ కనుగోలు.. కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహకర్తగా ఉన్నారు. కాంగ్రెస్ వార్ రూమ్ కేంద్రంగా పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితను కించ పరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. గత నవంబర్ 24న జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ వార్ రూమ్ పై దాడి చేసిన సైబర్ క్రైం పోలీసులు అక్కడున్న కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వాంగ్మూలం ఆధారంగా సునీల్ కనుగోలును ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ కేసు బుక్ చేశారు పోలీసులు.
ఆ కేసులో డిసెంబర్ 27న విచారణకు రావాలని 41ఏ సీఆర్పీసీ కింద సునీల్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. తనకు 41ఏ నోటీసులు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సునీల్ కనుగొలు హైకోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన ధర్మాసనం.. సైబర్ క్రైమ్ విచారణకు సహకరించాలని సునీల్ ని ఆదేశించింది. అరెస్ట్ చేయొద్దని కూడా పోలీసులకు సూచించింది.
ఆ కేసు విచారణలో భాగంగానే సైబర్ క్రైమ్ పోలీసుల ముందు కాంగ్రెస్ వ్యహకర్త సునీల్ కనుగోలు విచారణకు హాజరయ్యారు. దాదాపు రెండు గంటల పాటు విచారించారు. మొదట అనారోగ్య కారణాలతో రాలేనని సునీల్ కనుగోలు పోలీసులకు లేఖ ద్వారా సమాచారం ఇచ్చారు. సునీల్ విజ్ఞప్తిని పోలీసులు తిరస్కరించడంతో కాసేపటికే పోలీసులు అడిగిన పలు డాక్యుమెంట్లతో విచారణకు హాజరయ్యారు. వీడియో మార్ఫింగ్పై సునీల్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డ్ చేశారు. సోషల్ మీడియా పోస్టులకు సంబంధించిన వివరాలను సునీల్ నుంచి సేకరించినట్టు తెలుస్తోంది. మరోసారి సునీల్ కనుగోలును విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు.
ఇదే కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లురవికి సైతం సైబర్ క్రైం పోలీసులు 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. ఈ నెల 12న విచారణకు హాజరు కావాలని నోటీసులో తెలిపారు. సునీల్ కనుగోలు విచారణ తర్వాత మల్లు రవికి నోటీసులు రావడంతో.. విచారణలో సునీల్ ఏం చెప్పారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఈ కేసు చిక్కుముడి ఇంకా ఎవరెవరికి చుట్టుకోనుంది?