ODI Series:కొత్త ఏడాదిలో అద్భుత ఆటతీరుతో శ్రీలంకపై 2-1 తేడాతో టీ-20 సిరీస్ గెలిచిన టీమిండియా… అదే ప్రత్యర్థితో ఇప్పుడు వన్డే సిరీస్కు సిద్ధమైంది. రేపటి నుంచి రెండు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. జనవరి 10న గౌహతిలో తొలి వన్డే, జనవరి 12న కోల్కతాలో రెండో వన్డే… జనవరి 15న తిరువనంతపురంలో మూడో వన్డే జరుగుతుంది.
టీ-20 సిరీస్కు విశ్రాంతి తీసుకున్న సీనియర్లు… వన్డే సిరీస్లోకి రీఎంట్రీ ఇవ్వబోతుండటంతో… జట్టు మరింత పటిష్టంగా మారింది. అయితే సీనియర్ల రాకతో టీ-20 సిరీస్ ఆడిన రుతురాజ్ గైక్వాడ్, దీపక్ హుడా, హర్షల్ పటేల్, ముఖేష్ కుమార్, జితేశ్ శర్మ, శివమ్ మావి, సంజూ శాంసన్… వన్డే సిరీస్కు దూరమవుతున్నారు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి వన్డే టీమ్ సారథ్య బాధ్యతలు చేపట్టనుండగా.. కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, మహ్మద్ షమీ, బుమ్రా… జట్టులో చేరతారు. వీళ్లలో బుమ్రా చాన్నాళ్ల తర్వాత జట్టులోకి వస్తున్నాడు. యువ పేసర్ల జోరు ముందు బుమ్రా తన మార్క్ చూపిస్తాడా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్ మంచి ఫామ్ కనబరుస్తుండటంతో… వెటరన్ పేసర్ షమీకి తుది జట్టులో చోటు దక్కడం అనుమానంగా మారింది.
బ్యాటింగ్ విభాగంలో రోహిత్, కేఎల్ రాహుల్ రీ ఎంట్రీ ఇవ్వడంతో… యువ ఓపెనర్లు శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్లకు చోటు దక్కుతుందా? లేదా? అనే ఉత్కంఠ ఏర్పడింది. రోహిత్, రాహుల్లను కాదని వాళ్లద్దరికి తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు చాలా తక్కువ. వన్ డౌన్లో కోహ్లి, నాలుగో స్థానంలో భీకర ఫామ్లో ఉన్న సూర్యకుమార్ యాదవ్, ఐదో ప్లేస్లో మిస్టర్ స్టేబుల్ శ్రేయస్ అయ్యర్లకు చోటు ఖాయం. ఇక ఆల్రౌండర్ల కోటాలో హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తుది జట్టులో ఉంటారు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కోటాలో చాహల్ లేదా కుల్దీప్కు… ఫాస్ట బౌలింగ్ విభాగంలో బుమ్రాతో పాటు షమీ లేదా సిరాజ్, అర్షదీప్ లేదా ఉమ్రాన్ మాలిక్లకు తుది జట్టులో చోటు దొరికే ఛాన్స్ ఉంది.