WTC Final:వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ బెర్త్ను ఆస్ట్రేలియా దాదాపు ఖారారు చేసుకుంది. దక్షిణాఫ్రికాపై 3 టెస్టుల సిరీస్ను 2-0 తేడాతో గెలుచుకున్న కంగారూలు… డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో 75.56 శాతంతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. సౌతాఫ్రికా మాత్రం 48.72 శాతం పాయింట్లతో నాలుగో స్థానానికి పడిపోయి… ఫైనల్ చేరే అవకాశాలను క్లిష్టం చేసుకుంది.
ప్రస్తుతం డబ్ల్యుటీసీ పాయింట్ల పట్టికలో 58.93 శాతంతో భారత్ రెండో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్పై టెస్ట్ సిరీస్ విజయంతో టీమిండియా రెండో స్థానానికి ఎగబాకింది. ఇక శ్రీలంక 55.33 శాతం పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. 46.97 శాతం పాయింట్లతో ఇంగ్లండ్ ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఆసీస్ పర్యటనలో సౌతాఫ్రికా
0-2 తేడాతో ఓడిపోవడంతో… భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్కు వెళ్లే అవకాశాలు మెరుగయ్యాయి. కాకపోతే… మూడో స్థానంలో ఉన్న శ్రీలంక నుంచి ఇప్పుడు టీమిండియాకు ముప్పు ఉంది.
సొంతగడ్డపై జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాను 4-1 తేడాతో ఓడిస్తే… ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా 61.92 శాతం పాయింట్లతో భారత్ డబ్ల్యుటీసీ ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంటుంది. ఇక వచ్చే మార్చిలో న్యూజిలాండ్ పర్యనటకు వెళ్లే శ్రీలంక… రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడనుంది. ఒకవేళ కివీస్ మీద లంక రెండు టెస్టులూ గెలిచి సిరీస్ను క్లీన్ స్వీప్ చేస్తే… 61.11 శాతం పాయింట్లు సాధిస్తుంది. అప్పుడు ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో భారత్ ఓడిపోయినా,
2-2 డ్రాగా ముగించినా… శ్రీలంక డబ్ల్యుటీసీ ఫైనల్కు చేరుకుంటుంది.
ఇక వెస్టిండీస్తో జరిగే టెస్ట్ సిరీస్లో… సౌతాఫ్రికా 2-0 తేడాతో గెలిస్తే… 55.55 శాతం పాయింట్లు సాధిస్తుంది. అప్పుడు కివీస్ చేతిలో లంక, ఆసీస్ చేతిలో భారత్ ఓడితే… సౌతాఫ్రికా ఆశలు సజీవంగా ఉంటాయి. కానీ, టీమిండియా ఆడే చివరి నాలుగు టెస్టుల్లో రెండు గెలిచినా… ప్రొటీస్ డబ్ల్యుటీసీ ఫైనల్ ఆశలు గల్లంతైనట్లే.