Indigo : విమాన ప్రయాణికుల్లో కొందరు తప్పతాగి వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య తరచుగా జరుగుతున్నాయి. వారి అరాచకాలకు మహిళలే బాధితులు అవుతున్నారు. ఇటీవల ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో మహిళపై మూత్రవిసర్జన చేసిన ఘటన పెనుదుమారం రేపింది. తాజాగా ఇండిగో విమానంలో ప్రయాణికులు మద్యం మత్తులో కీచక పర్వానికి పాల్పడ్డారు. ఎయిర్హోస్టస్ను లైంగిక వేధింపులకు గురిచేశారు. అడ్డొచ్చిన విమాన కెప్టెన్పై దాడి చేశారు. ఆదివారం రాత్రి ఢిల్లీ నుంచి పట్నా వెళ్లిన ఇండిగో విమానంలో ఈ ఘటన జరిగింది.
ఈ విమానంలో ముగ్గురు ప్రయాణికులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. దీంతో విమాన సిబ్బంది ఎయిర్పోర్టు అధికారులకు సమాచారమిచ్చారు. ఆదివారం రాత్రి 10 గంటలకు విమానం పట్నా విమానాశ్రయంలో దిగగానే సీఐఎస్ఎఫ్ అధికారులు వీరిలో ఇద్దరిని అదుపులోకి పోలీసుస్టేషన్కు తరలించారు. మరో వ్యక్తి పరారయ్యాడు. అతడి కోసం గాలిస్తున్నారు. నిందితులు బిహార్కు చెందినవారిగా గుర్తించారు. నిందుతులు ఆర్జేడీ నేత బిహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కు సన్నిహితులని జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
గతేడాది నవంబర్ 26న న్యూయార్క్ నుంచి ఢిల్లీ వచ్చిన ఎయిరిండియా విమానంలో ఓ మహిళపై శంకర్ మిశ్రా అనే ప్రయాణికుడు మద్యం మత్తులో మూత్ర విసర్జన చేసిన ఘటన తీవ్ర దుమారం రేపింది. ఈ కేసులో నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నాడు. ఈ ఘటనలో ఎయిరిండియా సిబ్బంది అలసత్వంపై విమర్శలు వచ్చాయి. దీంతో విమాన పైలట్, క్యాబిన్ సిబ్బందిపై వేటు వేసింది. ఈ విషయంలో ఎయిరిండియా వేగంగా స్పందించి ఉంటే బాగుండేదని టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ అన్నారు మరో ఎయిరిండియా విమానంలోనూ ఓ ప్రయాణికుడు.. తోటి ప్రయాణికురాలి దుప్పటిపై మూత్ర విసర్జనకు పాల్పడ్డాడు. ఈ రెండు ఘటనలపై డీజీసీఏ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మధ్య జరిగిన మూడు ఘటనల్లో మహిళలే బాదితులుగా ఉన్నారు. నిందితులు మద్యం మత్తులోనే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారు. దీనిపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.