Kalva : ఏపీలో ప్రతిపక్ష నేతలపై పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1 ప్రతిపక్షాల కార్యక్రమాలకు అడ్డంకిగా మారింది. ఇటీవల కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. తాజాగా అనంతపురం జిల్లాలో ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితులే తలెత్తాయి.
ఇసుక అక్రమ తవ్వకాలకు వ్యతిరేకంగా టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ యాత్రపై పోలీసులు ఆంక్షలు విధించారు. పాదయాత్ర నిర్వహించకుండా రాయదుర్గంలోని కాల్వ నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. డీఎస్పీ, ఐదుగురు సీఐలు, ఐదుగురు ఎస్సైలలతోపాటు 150 మంది పోలీసులు కాల్వ నివాసం చుట్టూ మోహరించారు. ఇదే సమయంలో టీడీపీ ముఖ్య నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాల్వ శ్రీనివాసులకు మద్దతుగా టీడీపీ శ్రేణులు ఆయన నివాసానికి భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. పోలీసులు నిర్బంధించిన నేపథ్యంలో కాల్వ శ్రీనివాసులు తన ఇంటి వెనుక నుంచి రోడ్డుపైకి వచ్చేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో పోలీసులు-టీడీపీ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. వైసీపీ నేతల ఇసుక అక్రమ తరలింపును అడ్డుకోనేందుకు వెళ్లనీయకుండా తమను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమని కాల్వ మండిపడ్డారు. అటు పోలీసులు ఇటు టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో కాల్వ శ్రీనివాసులు ఇంటివద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 1 తీసుకొచ్చిన తర్వాత పోలీసులు రోడ్లపై ర్యాలీలు, సభలకు అనుమతించడంలేదు. దీంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.