Varasudu : నిర్మాత దిల్ రాజు లెక్కలు పక్కాగా ఉంటాయి. ఏ సీజన్ లో ఎలాంటి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలో బాగా తెలిసిన నిర్మాత. అందుకే ఎన్నో విజయాలు అందుకున్నారు. ఈ సంక్రాంతి సీజన్ లో అలాగే ప్లాన్ చేశారు. ఈ నెల 11 విజయ్ హీరోగా నటించిన ‘వారసుడు’ విడుదల చేయాలనుకున్నారు. అయితే దిల్రాజు ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు.
వాల్తేరు వీరయ్య , వీరసింహారెడ్డి చిత్రాలను దృష్టిలో పెట్టుకుని తన చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు దిల్ రాజు ప్రకటించారు. జనవరి 14న వారసుడును ప్రేక్షకుల ముందుకుతీస్తామన్నారు. ఈ సందర్భంగా దిల్ రాజు చేసిన కామెంట్ టాలీవుడ్ లో తీవ్ర చర్చకు దారితీశాయి. చిరంజీవి, బాలయ్య మూవీలకు ఎక్కువ థియేటర్లు కావాలని.. అందుకే తానే ఒక అడుగు వెనక్కి వేశానని అన్నారు. పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అని వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి తప్పని సరి పరిస్థితుల్లోనే తన సినిమా విడుదలను దిల్ రాజు వాయిదా వేశారని అర్థమవుతోంది.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించిన తమిళ చిత్రం ‘వారిసు’. రష్మిక హీరోయిన్. తెలుగులో ‘వారసుడు’పేరుతో విడుదల చేస్తున్నారు. భారీ బడ్జెట్తో దిల్రాజు ఈ సినిమాను నిర్మించారు. తొలుత ఈ సినిమాను రెండు భాషల్లో ఒకేసారి విడుదల చేయాలనుకున్నారు. కానీ జనవరి 11న తమిళంలో, 14న తెలుగు భాషలో థియేటర్లో విడుదల కానుంది.
సంక్రాంతికి బాలకృష్ణ వీరసింహారెడ్డిగా ప్రేక్షకులను పలకరించబోతున్నారు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటించిన యాక్షన్ మూవీ ఇది. శ్రుతిహాసన్ కథానాయిక. జనవరి 12న ఈ చిత్రం థియేటర్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచేశాయి.
‘రికార్డ్స్లో నా పేరు ఉండటం కాదు.. నా పేరు మీదే రికార్డులు ఉంటాయి’ అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి . చిరు కథానాయకుడిగా నటించి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘వాల్తేరు వీరయ్య’. శ్రుతిహాసన్ కథానాయిక. ఈ చిత్రం జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. రవితేజ కీలక పాత్రలో నటించిన ఈ మూవీని దర్శకుడు బాబీ మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కించారని ట్రైలర్ స్పష్టం చేస్తోంది.
తమిళంతోపాటు, తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న హీరో అజిత్ నటించిన యాక్షన్ మూవీ ‘తునివు’ తెలుగులో ‘తెగింపు’ టైటిల్తో ఈ నెల 11న విడుదల చేస్తున్నారు. ప్రతి సంక్రాంతికి అగ్ర కథానాయకులు సినిమాలు విడుదలైనా ఒక చిన్న చిత్రం కచ్చితంగా సందడి చేస్తూ వస్తోంది. ఈసారి సంతోష్ శోభన్ ప్రియాభవానీ శంకర్ జంటగా అనిల్ కుమార్ ఆళ్ల తెరకెక్కించిన చిత్రం ‘కళ్యాణం కమనీయం’ ప్రేక్షకులను అలరించనుంది. పెళ్లి నేపథ్యంలో సాగే ఈ సినిమా జనవరి 14న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకురానుంది.
దిల్ రాజు చేతిలో ఎన్నో థియేటర్లు ఉంటాయనేది బహిరంగ రహస్యమే. అయితే సంక్రాంతి బరిలో బాలయ్య, చిరంజీవి సినిమాలు ఉండటంతో ఆయన వెనక్కి తగ్గాల్సి వచ్చింది. అందుకే అనుకున్న దానికంటే 3 రోజుల ఆలస్యంగా థియేటర్లలోకి వారుసుడుని తీసుకొస్తున్నారు. మొత్తంమీద కొంత బిజినెస్ ను దిల్ రోజు కోల్పోవాల్సివస్తోంది. మొత్తంమీద వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య ఎఫెక్ట్ వారుసుడుపై పడింది. దీంతో దిల్ రాజు వెనక్కి తగ్గక తప్పలేదు.