Gautam Adani : గౌతమ్ అదానీ భారత్ లో అతిపెద్ద కార్పొరేట్ వ్యవస్థల్లో ఒకటైన అదానీ గ్రూప్ కు అధినేత. ప్రపంచంలో మూడో అత్యంత ధనవంతుడు. అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీలు దేశంలోని చాలా రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీలు ప్రధాని మోదీని విమర్శించే క్రమంలో గౌతమ్ అదానీపై ఆరోపణలు చేస్తున్నాయి. మోదీ దేశాన్ని అదానీకి దోచుపెడుతున్నారని విమర్శిస్తున్నాయి. ఈ విమర్శలకు ఇన్నాళ్లుగా నేరుగా స్పందించని గౌతమ్ అదానీ తాజాగా గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
తన జీవితంలో ఎలా ఎదిగానో గౌతమ్ ఆదానీ వివరించారు. తనకు జీవితంలో 3సార్లు వచ్చిన గొప్ప అవకాశాలే తన అభివృద్ధికి దోహదం చేశాయన్నారు. 1985లో మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ తీసుకొచ్చిన ఎగ్జిమ్ విధానం వల్ల తమ కంపెనీ గ్లోబల్ ట్రేడింగ్ హౌస్గా అవతరించిందని తెలిపారు. తర్వాత 1991లో అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావు హయాంలో తీసుకొచ్చిన ఆర్థిక సరళీకరణ విధానాల వల్ల పబ్లిక్- ప్రైవేట్ భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవడానికి దోహదం పడిందని వివరించారు. గుజరాత్లో మోదీ 12 ఏళ్లు సీఎంగా ఉన్న సమయంలో పెట్టుబడులకు మంచి ప్రోత్సాహం లభించిందన్నారు. గుజరాత్ పెట్టుబడులకు అనుకూల రాష్ట్రమని.. కేవలం అదానీకి మాత్రమే కాదని స్పష్టం చేశారు. కష్టపడి పనిచేయడం ఒక్కటే తన విజయసూత్రమని గౌతమ్ ఆదానీ తేల్చిచెప్పారు.
తమ కంపెనీలు దేశంలో 22 రాష్ట్రాల్లో ఉన్నాయని గౌతమ్ అదానీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, పశ్చిమ బెంగాల్లోనూ అదానీ గ్రూప్ పెట్టుబడులు పెట్టిందని వెల్లడించారు. ఈ రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు లేవన్న విషయాన్ని గమనించాలన్నారు నరేంద్ర మోదీ నుంచి ఎవరూ కూడా ఎలాంటి వ్యక్తిగత సాయం పొందలేరని గౌతమ్ అదానీ స్పష్టం చేశారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా విధానాల రూపకల్పనలో కొన్ని సలహాలు మాత్రం ఇచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. మోదీ ఏ విధానాన్ని తీసుకొచ్చినా కేవలం అదానీ గ్రూప్ కు మాత్రమే కాదని అందరికీ ఆ విధానాలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ తనని పదే పదే ఆశ్రిత పెట్టుబడిదారుడిగా పేర్కొంటున్నారని కానీ కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్లోనూ తాము రూ. 68 వేల కోట్లు పెట్టుబడిగా పెట్టామని వెల్లడించారు. అయితే రాహుల్ విధానాలు కూడా అభివృద్ధికి వ్యతిరేకంగా ఉండవని తనకు తెలుసని అదానీ వ్యాఖ్యానించడం విశేషం. మొత్తంమీద ప్రతిపక్షాలు పదేపదే చేస్తున్న విమర్శలకు గౌతమ్ అదానీ గట్టిగానే సమాధానం చెప్పారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్తో ఉన్న సంబంధాలపై గౌతమ్ అదానీ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కంపెనీ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ తనకు రోల్ మోడల్ అన్నారు. ముఖేశ్ అంబానీ తనకు మంచి మిత్రుడని పేర్కొన్నారు. కంపెనీని టెలీకాం, టెక్నాలజీ, రిటైల్ రంగాలకూ విస్తరించి రిలయన్స్కు కొత్త దిశను చూపించారన్నారు. దేశ పురోగమనంలో ముఖేశ్ కీలక పాత్ర పోషించారని ప్రశించారు.