Google Moves SC:సెర్చింజిన్ దిగ్గజం గూగుల్ సుప్రీంకోర్టు మెట్లెక్కింది. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా రెండు దఫాలుగా విధించిన రూ.2,274 కోట్ల జరిమానాపై స్టే ఇవ్వడానికి జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ నిరాకరించడంతో… ఆ నిర్ణయాన్ని గూగుల్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. గతంలో యూరోపియన్ యూనియన్ తమపై జారీ చేసిన ఆదేశాల నుంచి కొన్ని భాగాలను సీసీఐ కాపీ కొట్టిందని గూగుల్ తన పిటిషన్లో ఆరోపించినట్లు సమాచారం. సీసీఐ ఆదేశాలు అసాధారణమైనవని, తప్పుడు తడకలుగా ఉన్నాయని గూగుల్ పిటిషన్లో పేర్కొంది. ఆండ్రాయిడ్ ఓపెన్ సిస్టమ్ కారణంగా స్మార్ట్ఫోన్లు అందుబాటు ధరల్లో లభిస్తున్నాయని… దాదాపు 11 వందల ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీ కంపెనీలు, 15 వేలకు పైగా స్మార్ట్ఫోన్ మోడళ్లను ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో తీసుకొచ్చాయని గూగుల్ వాదించబోతున్నట్లు చెబుతున్నారు.
ఆండ్రాయిడ్ మార్కెట్లో గూగుల్ తన గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు… ప్లే స్టోర్ పాలసీ నిబంధనల్ని తుంగలో తొక్కుతోందని… పేమెంట్ యాప్స్, అండ్ పేమెంట్ సిస్టంను ప్రమోట్ చేస్తోందని… గత అక్టోబర్లో సీసీఐ రెండు దఫాలుగా రూ.2,274 కోట్ల జరిమానా విధించింది. ముందుగా రూ.1337.76 కోట్ల ఫైన్ విధించిన సీసీఐ… ఆ తర్వాత మరో నాలుగు రోజులకే రూ.936.44 కోట్ల జరిమానా విధించింది. గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేస్తున్న గూగుల్… తన పద్ధతి మార్చుకోవాలని సీసీఐ సూచించింది.
ఒక యాప్ అభివృద్ధి చేసిన డెవలపర్… అది యూజర్లకు చేర్చాలంటే యాప్ స్టోర్ పైనే ఆధార పడాలి. మన దేశంలో ఎక్కువగా వాడుతున్నవి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లే. దీంతో యాప్ డెవలపర్లు తమ యాప్ ను యూజర్లకు అందుబాటులోకి తీసుకురావాలంటే… గూగుల్ ప్లే స్టోర్ మీద ఆధార పడటం తప్ప వేరే దారి లేదు. ప్లే స్టోర్లో యాప్ లిస్ట్ చేయాలంటే గూగుల్ రూల్స్ కు తలొగ్గడంతో పాటు… గూగుల్ ప్లే బిల్లింగ్ సిస్టమ్ను అనుసరించాలి. ఇది గుత్తాధిపత్యాన్ని దుర్వినియోగం చేయడమేనని భావించిన సీసీఐ… గూగుల్కు భారీగా జరిమానా వడ్డించింది.