Sania Mirza:భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వచ్చే ఫిబ్రవరిలో రిటైర్ కాబోతున్నట్లు ప్రకటించింది. 2022లోనే ఆట నుంచి తప్పుకోవాలని భావించినా… ఆ తర్వాత మనసు మార్చుకుని కెరీర్ కొనసాగించింది. ఇప్పుడు తాను ఆడబోయే చివరి టోర్నీ ఏదో సానియా చెప్పేసింది.
ఫిబ్రవరిలో దుబాయ్లో జరిగే డబ్ల్యూటీఏ 1000 టోర్నీ తర్వాత తాను రిటైరవుతానని సానియా ప్రకటించింది. 36 ఏళ్ల సానియా ఈ ఏడాది ముందుగా ఆస్ట్రేలియన్ ఓపెన్లో ఆడనుంది. కజకిస్థాన్ క్రీడాకారిణి అనా డనిలినాతో కలిసి సానియా మహిళల డబుల్స్లో పోటీ పడబోతోంది. ఇదే ఆమెకు కెరీర్లో చివరి గ్రాండ్స్లామ్. ఆ టోర్నీ పూర్తయ్యాక దుబాయ్లో తన కెరీర్లోనే చిట్టచివరి టోర్నీ ఆడనుంది… సానియా.
2022లో యూఎస్ ఓపెన్ ఆడిన తర్వాత టెన్నిస్కు గుడ్బై చెప్పాలనుకున్న సానియా… గాయం అడ్డంకిగా మారడంతో రిటైర్మెంట్ వాయిదా వేసుకుంది. గాయంతో కెరీర్ను ముగించడం ఇష్టం లేదు కాబట్టే… మళ్లీ సాధన చేసి కోర్టులో అడుగుపెట్టానని సానియా చెబుతోంది.
కెరీర్లో మహిళల డబుల్స్ లో నెంబర్ వన్ ర్యాంక్ సాధించింది… సానియా. 2003 నుంచి 2013 వరకు సింగిల్స్ ఆడిన సానియా… భారత టెన్నిస్లో నెంబర్ వన్ క్రీడాకారిణిగా కొనసాగింది. అత్యుత్తమ క్రీడాకారిణులుగా పేరు పొందిన మార్టినా హింగిస్, డినారా సఫినా, కుజ్ నెత్సోవా, వెరా జ్వొనరెవా, మరిన్ బార్టోలి వంటివారిపై సింగిల్స్ లో గెలించింది… సానియా. 2007లో సింగిల్స్ లో కెరీర్లోనే అత్యుత్తమంగా 27వ ర్యాంకు సాధించారు. ఆరు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన టైటిళ్ళు సానియా ఖాతాలో ఉన్నాయి. వాటిలో కొన్ని మహిళల డబుల్స్ టైటిళ్లు కాగా, మరికొన్ని మిక్సిడ్ డబుల్స్ టైటిళ్లు. 2015లో ప్రతిష్టాత్మక వింబుల్డన్ విమెన్స్ డబుల్స్ టైటిల్ నెగ్గింది… సానియా. ఆసియా క్రీడలు, కామన్ వెల్త్ గేమ్స్, ఆఫ్రో-ఆసియా క్రీడల్లోనూ సానియా 14 పతకాలు గెలుచుకుంది. అందులో 6 గోల్డ్ మెడల్స్ ఉన్నాయి.